
హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అందరికీ గుర్తే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ ఉత్కంఠను కలిగించిన సంగతి తెలిసిందే. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో బంతులను తినేస్తూ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
అయితే, దినేశ్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించి ఉండకపోతే విజయ్ శంకర్ పరిస్థితి మరోలా ఉండేది. తాజాగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్లో ఇలాంటి సందర్భమే చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా విజయ్ శంకర్ ఆటపై అభిమానులు మరోసారి సెటైర్లు వేశారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో రిషబ్ పంత్, విజయ్ శంకర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఢిల్లీ విజయానికి 7 ఓవర్లలో 108 పరుగులు కావాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ శంకర్ 13 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. ఓ వైపు రిషబ్ పంత్ భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటే విజయ్ శంకర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడాడు. దీంతో ఢిల్లీ అభిమానులు విజయ్ శంకర్పై ట్విట్టర్లో జోకులు విసిరారు.
అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తనపై వచ్చిన సెటైర్లకు విజయ శంకర్ సరైన సమాధానం ఇచ్చాడు. ఓటమి ఖాయం అనుకున్న ఢిల్లీ అభిమానుల్లో గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. చెన్నై ఆటగాళ్లకు గుండెల్లో గుబులు పుట్టించాడు. సిక్సులు మీద సిక్సులు బాది స్టేడియంను హోరెత్తించాడు.
రిషబ్ పంత్ (45 బంతుల్లో 79) ఔటయ్యే సమయానికి విజయ్ 21 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఆఖరి 12 బంతుల్లో ఢిల్లీ 49 పరుగులు చేయాల్సి ఉంది. 19 ఓవర్ వేయడానికి డ్వేన్ బ్రావో బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్లో శంకర్ విజృంభించాడు. మూడు భారీ సిక్సులు బాది ఆ ఓవర్లో 21 పరుగులు రాబట్టాడు.
ఇక ఆఖరి ఓవర్లో 28 పరుగులు చేయాలి. లుంగి ఎంగిడి బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్లో రెండో బంతిని కూడా శంకర్ సిక్స్గా మలిచాడు. కానీ తర్వాతి నాలుగు బంతులను ఎంగిడి కట్టుదిట్టంగా వేయడంతో చెన్నై విజయం సాధించింది. శంకర్ 5 సిక్సులు, ఒక ఫోర్తో 31 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
ఢిల్లీకి విజయాన్ని అందించడానికి తెగ ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటి వరకు సెటైర్లు వేసిన నెటిజన్లు ఆ తర్వాత విజయ్ శంకర్ ఇన్నింగ్స్పై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్లు ఆడిన విజయ్ శంకర్.. 34.60 సగటుతో 173 పరుగులు చేశాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.