మరో ఎనిమిది రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఆటగాళ్లందరూ తమ ఫ్రాంచైజీలకు చేరుకుంటున్నారు. కొందరు ప్లేయర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. కఠోర శ్రమతో చెమటోడుస్తున్నారు. మార్చి 22న జరగనున్న ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఈ నేపథ్యంలో సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో తమ జట్టు విశేషాలు పంచుకున్నాడు. మునపటిలా గొప్ప ప్రదర్శనతో టైటిల్ను నిలబెట్టుకుంటామని బ్రావో తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రత్యేకమైనదని, ఆటగాళ్లపై ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పాడు. రెండేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న సీఎస్కే పాల్గొన్న 14 సీజన్లలో అయిదు ట్రోఫీలు సాధించింది.

''ఫ్రాంచైజీ నుంచి ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఆటగాళ్లు స్వేచ్ఛగా తమ శైలిలో ప్రదర్శన చేసేలా వాతావరణం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న గొప్పతనం ఇదే. మా జట్టు బాగుంది. నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. గత సీజన్ను ఎలా ముగించామో,ఈసారి అదే ప్రదర్శన కొనసాగిస్తాం. గత సీజన్లో యువ బౌలింగ్తో అద్భుతాలు సృష్టించాం''
''ఈ సీజన్లో శార్దూల్ ఠాకూర్ తిరిగొస్తున్నాడు. అది మాకు బోనస్గా మారుతుంది. అలాగే నాణ్యమైన బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా జట్టులో ఉన్నాడు. గత సీజన్లో పతిరన, తుషార్ దేశపాండే గొప్పగా సత్తాచాటారు. పతిరనను మేం బేబీ మలింగ అని పిలుస్తాం. ఈ కుర్రాళ్లతో కలిసి పనిచేయడం ఎంతో బాగుంది. ఈ సీజన్లో రాణిస్తారని ఆశిస్తున్నాం'' అని బ్రావో పేర్కొన్నాడు.
టీమిండియాలో సత్తాచాటుతున్న కుర్రాళ్ల గురించి బ్రావో మాట్లాడాడు. ''యశస్వీ జైస్వాల్కు ఉత్తేజకరమైన ప్రతిభ ఉంది. అతడి ఆటను చూడాలనిపిస్తుంటుంది. అలాగే తిలక్ వర్మ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్.. నా ఫేవరేట్ ప్లేయర్లలో ఒకరు'' అని బ్రావో పేర్కొన్నాడు.
సీఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్ కీలక ప్లేయర్. ఓపెనర్గా అతడు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కాగా, బ్రావో 2022 సీజన్ అనంతరం ఐపీఎల్కు గుడ్బై పలికాడు. లీగ్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సీఎస్కేకు బౌలింగ్ కోచ్గా సేవలు అందిస్తున్నాడు.