
హైదరాబాద్: ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్కు భారత్ నుంచి కోచ్లు తీసుకోకపోవడంపై దేశీవాలీ కోచ్ సనత్కుమార్ మండిపడ్డారు. విదేశీయులనైనా చూసి నేర్చుకోవాల్సిందంటూ హితవు పలికారు. స్వదేశంలో జరుగుతున్న లీగ్కు ఇక్కడి వారినే కోచ్లుగా తీసుకోవాలంటూ డిమాండు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు.
'ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే.. భారతీయులకే ఎక్కువ అవకాశాలు దక్కాలి. కానీ.. ఇక్కడ పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అదే.. బిగ్బాష్ లీగ్లో చూడండి.. ముప్పావు వంతు ఆస్ట్రేలియాకి చెందిన వాళ్లే కోచ్లుగా ఉంటారు. నాట్వెస్ట్ టీ20 టోర్నీలోనూ ఇంగ్లాండ్ వాళ్లకే ప్రాధాన్యం. కానీ.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి మాత్రం ఇక్కడివారు అక్కర్లేదా..?' అని సనత్ కుమార్ ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. టోర్నీలోని ఎనిమిది జట్లకి చెందిన ఫ్రాంఛైజీలు ఇప్పటికే జట్టు కోచ్, సహాయ సిబ్బంది ఎంపికను పూర్తిచేసి వ్యూహాలను లిఖించే పనిలో మునిగిపోయాయి. టోర్నీలో భారత్కి చెందిన కోచ్లు, మాజీ క్రికెటర్లను అవమానించే రీతిలో ఫ్రాంఛైజీలు వ్యవహరిస్తున్నాయని దేశవాళీలో విజయవంతమైన కోచ్గా పేరొందిన సనత్ కుమార్ ఆరోపించారు.
ఆవేదన వ్యక్తం చేస్తున్న సనత్ కుమార్:
అయితే.. ఐపీఎల్లో తనను మాత్రం ఎవరూ కోచ్గా కాదు కదా.. కనీసం సహాయ సిబ్బందిగా కూడా తీసుకోలేదని సనత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వీరేంద్ర సెహ్వాగ్ని కోచ్/ మెంటార్గా నియమించడం మినహా.. మిగిలిన ఏడు ఫ్రాంఛైజీలు విదేశీ కోచ్లపైనే ఎక్కువగా మొగ్గు చూపాయని ఈ మాజీ పేసర్ ఆరోపించారు.
విదేశీ కోచ్లతో ఐపీఎల్ జట్లు:
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్కి స్టీఫెన్ ప్లెమింగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి డేనియల్ వెటోరి, ఢిల్లీ డేర్డెవిల్స్కి రికీ పాంటింగ్, రాజస్థాన్ రాయల్స్కి షేన్ వార్న్, ముంబై ఇండియన్స్కి మహేల జయవర్దనె, సన్రైజర్స్ హైదరాబాద్కి టామ్మూడీ, కోల్కతా నైట్రైడర్స్కి జాక్వెస్ కలిస్ కోచ్ లేదా మెంటార్గా బాధ్యతలు స్వీకరించారు. వీరంతా విదేశీయులేనని సనత్ కుమార్ గుర్తుచేశారు.