బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఈ లీగ్ కారణంగానే బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అవతరించగలిగింది. అయినప్పటికీ ఐపీఎల్ మొత్తం విలువలో భారీ క్షీణత కనిపించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఈ టోర్నమెంట్ విలువ తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.6,600 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విలువ తగ్గుదలకు గల కొన్ని ముఖ్య కారణాలు ఇప్పుడు బయటపడ్డాయి.
బీసీసీఐకి రూ.6,600 కోట్ల భారీ దెబ్బ
ఓ నివేదిక ప్రకారం.. 2025లో ఐపీఎల్ విలువ రూ.76,100 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది ఐపీఎల్ విలువ రూ.82,700 కోట్లుగా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి రూ.6,600 కోట్ల నష్టం వాటిల్లింది.

విలువ తగ్గడానికి ప్రధాన కారణాలు:
ఆ నివేదికలో ఈ విలువ తగ్గుదలకు ప్రధాన కారణాలను వివరించారు:
హాట్స్టార్, వయాకామ్18 విలీనం: 2024లో హాట్స్టార్, వయాకామ్18 విలీనం అవ్వడం వల్ల వ్యాపారంలో బీసీసీఐకి నష్టం జరిగింది. 2023 నుంచి 2028 వరకు మీడియా హక్కుల కోసం వయాకామ్18, హాట్స్టార్ మధ్య పోటీ జరిగినప్పుడు బీసీసీఐకి తమ హక్కులకు అధిక మొత్తం లభించింది. ఆ సమయంలో మార్కెట్లో ఉన్న పోటీ క్రికెట్ బోర్డుకు లాభదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసిపోవడంతో అది బీసీసీఐ విలువ అంచనాకు సరైంది కాదని నివేదిక పేర్కొంది.
రియల్ మనీ యాప్లపై నిషేధం: ఐపీఎల్లో ఫాంటసీ యాప్ల ప్రమోషన్, ప్రకటనల ద్వారా బీసీసీఐకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఈ యాప్లపై కూడా నిషేధం విధించబడింది. దీని వల్ల కూడా బీసీసీఐకి నష్టం వాటిల్లింది.
రెండేళ్లలో రూ. 16,400 కోట్ల నష్టం
ఐపీఎల్కు గత రెండేళ్లలో భారీ నష్టం వాటిల్లింది. కేవలం 2025లోనే కాకుండా అంతకుముందు కూడా ఐపీఎల్ విలువలో క్షీణత నమోదైంది. గత రెండేళ్లలో చూసుకుంటే బీసీసీఐకి ఏకంగా రూ. 16,400 కోట్ల నష్టం వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఈ నష్టం బీసీసీఐకి షాకిచ్చింది. రాబోయే కాలంలో తమ లీగ్ మొత్తం విలువను పెంచడానికి బీసీసీఐ కొన్ని కొత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.