మరో 11 రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది. మార్చి 22న ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే సీజన్ ప్రారంభంకాక ముందే ఈ సారీ ఐపీఎల్ హీట్ మొదలైంది. గత సీజన్తో పోలిస్తే ఈ సారి ముగ్గురు కెప్టెన్లు కేవలం ప్లేయర్లుగా జట్టులో కొనసాగనున్నారు.
గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ను నడిపించిన ఎయిడెన్ మార్క్రమ్ ఈ సారి కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. మార్క్రమ్కు బదులుగా ఎస్ఆర్హెచ్ జట్టు బాధ్యతలను ప్యాట్ కమిన్స్ అందుకున్నాడు. అలాగే డేవిడ్ వార్నర్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్కు రిషభ్ పంత్ కెప్టెన్సీ నిర్వహించనున్నాడు. పంత్ గైర్హాజరీలో వార్నర్ జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు ముంబై ఫ్రాంచైజీ అందించింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు నుంచి నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ను జట్టులో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 36 ఏళ్ల రోహిత్ను ముంబై వదిలేసే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్-2025 సీజన్ ముందు ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ విడిచి, చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లాలని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నాడు. ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ అందుకోవాలని రాయుడు సూచించాడు.
''మరో అయిదు నుంచి ఆరేళ్ల పాటు రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడగలడు. రోహిత్ కెప్టెన్గా ఉండాలని భావిస్తే ప్రపంచమంతా అతనికి స్వాగతం పలుకుతుంది. సారథిగా ఉండాలనుకుంటే రోహిత్ సులభంగా కెప్టెన్ అవుతాడు.
అయితే 2025లో సీఎస్కేకు రోహిత్ ఆడాలని కోరుకుంటున్నా. ధోనీ వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ జట్టును నడిపించవచ్చు'' అని రాయుడు పేర్కొన్నాడు.