హైదరాబాద్:బుధవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టులో అత్యధికంగా డివిలియర్స్(8) సిక్స్లు, డికాక్(4), మన్దీప్ సింగ్(3), వాషింగ్టన్ సుందర్(1) కలిపి మొత్తం 16 బాదారు. లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాట్స్మెన్లలో అత్యధికంగా అంబటి రాయుడు(8), మహేంద్రసింగ్ ధోనీ(7), షేన్ వాట్సన్(1), డ్వేన్ బ్రావో(1) కలిపి 17 భారీ సిక్సర్లు కొట్టారు. ధోనీ ఒక్కడే ఈ మ్యాచ్లో ఏకంగా ఏడు సిక్సర్లు బాదేశాడు.
దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్లు నమోదు చేసిన మ్యాచ్గా ఇది రికార్డు సృష్టించింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 33 సిక్సర్లు బాదేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 31 సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఢిల్లీ డేర్డెవిల్స్, గుజరాత్ లయన్స్ మధ్య పోరులో కూడా 31 సిక్సర్లు బాదేశారు. థ్రిల్లింగ్ మ్యాచ్లో హిట్టర్లు బాదిన 33 సిక్స్లను 33 సెకన్లలో వీక్షించండి.
ఈ మ్యాచ్లో చెన్నై, బెంగళూరు జట్ల సిక్సులతో పాటు ప్రధాన ఆకర్షణగా క్రికెటర్ల భార్యలు కూడా స్టేడియంలో మెరిశారు. మ్యాచ్ చూస్తూనే ప్రతి సిక్సుకు, బౌండరీకి స్పందిస్తూ కళ్లతోనే హావభావాలు ఒలికించారు. ధోనీ భార్య సాక్షి ధోనీ కొట్టిన ప్రతి సిక్సుకు లేచి సంబరాలు చేసుకుంటున్నట్లుగా స్పందించింది.