రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు మరోసారి నిరాశపరిచారు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ భారీ స్కోరు సమర్పించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. శుభారంభం దక్కకపోయినా జీటీ అదిరేలా ఇన్నింగ్స్ను ఫినిష్ చేసింది.
సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. డేవిడ్ మిల్లర్ (26*; 19 బంతుల్లో, 2x4, 1x6) ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు.

అయితే ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ సరసన ఆర్సీబీ నిలిచింది. ఐపీఎల్లో బెంగళూరు, పంజాబ్ ఇప్పటివరకు 28 సార్లు 200+ స్కోరు ఇచ్చాయి.
కాగా, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆదిలో ఆర్సీబీ బౌలర్లు పైచేయి సాధించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పవర్ప్లేలో 42 పరుగులే ఇచ్చారు. కానీ షారుక్ ఖాన్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. సుదర్శన్తో కలిసి బౌండరీల మోత మోగించాడు. షారుక్కు పోటీగా సుదర్శన్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్దరు మూడో వికెట్కు 45 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
షారుక్ 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో తనకి ఇదే తొలి హాఫ్ సెంచరీ. అయితే ప్రమాదకరంగా మారుతున్న షారుక్ను సిరాజ్ కళ్లుచెదిరే యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బాదే బాధ్యతను సాయి సుదర్శన్ తీసుకున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్న అతను అనంతరం దూకుడు పెంచాడు. మిల్లర్తో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు.చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 47 పరుగులు సాధించింది.