రాజస్థాన్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ముగిసింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి.. చెన్నై ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు బట్లర్, రహానేలు మంచి ఆరంభమే ఇచ్చారు.
అయితే రాహుల్ చాహర్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి రహానే (14) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శార్థూల్ ఠాకూర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ (23) వరుసగా మూడు ఫోర్లు బాది ఊపుమీద కనిపించాడు. ఇదే ఊపులో ఆ తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మిషెల్ శాంట్నర్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి శాంసన్ (6) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (10).. స్టీవ్ స్మిత్ (15)లు జడేజాకు చిక్కి పెవిలియన్ చేరారు.
ఈ సమయంలో స్టోక్స్, పరాగ్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టోక్స్ (28) దీపక్ చాహర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరాగ్ (16) ఠాకూర్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ చివర్లో జోఫ్రా ఆర్చర్ (13), శ్రేయస్ గోపాల్ (19)లు ధాటిగా ఆడడంతో.. రాజస్థాన్ 151 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో చాహర్, ఠాకూర్, జడేజా తలా రెండు వికెట్లు తీశారు.