మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ
తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ వేయగా.. విరాట్ కోహ్లీ క్రీజులో తొలి బంతిని ఎదుర్కొన్నాడు. ఇక ఈ ఓవర్లో చివరి బంతికి కోహ్లీ సిక్సర్ కొట్టాడు. 2వ ఓవర్లో ప్రసీద్ క్రిష్ణ బౌలింగ్లో డుప్లెసిస్ తొలి బంతికి ఎల్బీడబ్లూ గండం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆ ఓవర్లో కోహ్లీ (6పరుగులు 7బంతుల్లో 1సిక్స్) అత్యంత చెత్త షాట్ ఆడి కీపర్ సంజూ శాంసన్ చేతికి క్యాచ్ ఔట్గా చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ మరోసారి తన ఫామ్ కొనసాగించాడు. కెప్టెన్ డుప్లెసిస్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు అడపాదడపా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రజత్ పటీదార్
ఇక 5వ ఓవర్లో ప్రసీద్ బౌలింగ్ వేయగా ఆ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు కనబర్చిన పటీదార్ ఇచ్చిన సులువైన క్యాచ్ను రియాన్ పరాగ్ మిస్ చేశాడు. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని పటీదారు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇక 9వ ఓవర్లో ప్రమాదకర చాహల్ బౌలింగ్లోనూ సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలో 10వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో రజత్ పటీదార్ ఎల్బీడబ్లూ గండాన్ని కూడా గట్టెక్కాడు. రాజస్థాన్ రివ్యూ కోరగా.. నాటౌట్ అని వచ్చింది. ప్రమాదకరంగా మారుతున్న పటీదార్, డుప్లెసిస్ జోడీని.. పేసర్ ఒబెడ్ మెక్కాయ్ విడగొట్టాడు. మెక్కాయ్ వేసిన బౌలింగ్లో హిట్టింగ్ చేయాలని డుప్లెసిస్ (25పరుగులు 27బంతుల్లో 3ఫోర్లు) చూడగా.. అది ఎడ్జ్ అయి లాంగ్ స్లిప్ పొజిషన్లో ఉన్న అశ్విన్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 70పరుగుల వీరిద్దరి పార్ట్నర్ షిప్ ముగిసింది.
మ్యాక్స్ వెల్ ఉన్నంత సేపు ధాటిగా ఆడినప్పటికీ..
తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్తో కలిసి పటీదార్ మరోసారి ఇన్నింగ్స్ నడిపించే ప్రయత్నం చేశాడు. 12వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో సిక్స్ కొట్టి టచ్లోకి వచ్చిన మ్యాక్సీ ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. 13వ ఓవర్లో చాహల్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ కొట్టి స్కోరు బోర్డు మూమెంటమ్ పెంచాడు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న టైంలో బౌల్ట్ దెబ్బకొట్టాడు. 14వ ఓవర్ చివరి బంతికి మ్యాక్స్ వెల్ ను క్యాచ్ ఔట్ చేశాడు. ఒబెడ్ మెక్కాయ్ అద్భుత క్యాచ్ వల్ల మ్యాక్సీ ఔటయిపోయాడు. అయినా రజత్ పటీదార్ ఉన్నాడనే ధీమా ఇంకా ఆర్సీబీలో ఉంది. 15వ ఓవర్లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పటీదార్.. తర్వాత ఓవర్లో అశ్విన్ బౌలింగ్లోనూ సిక్స్ కొట్టాడు. ఇక తర్వాతి బంతికి కూడా హిట్టింగ్ చేయగా.. లాంగ్ ఆఫ్లో ఉన్న జాస్ బట్లర్ అద్భుత క్యాచ్ పట్టడంతో పటీదార్ (58పరుగులు 42బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు) ఇన్నింగ్స్ ముగిసింది.
చివర్లో దెబ్బతిన్న మూమెంటమ్
ఇక క్రీజులో దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ కాస్తో కూస్తో ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే ఒబెడ్ మక్కాయ్ బౌలింగ్లో లోమ్రోర్ (8పరుగులు 10బంతుల్లో) క్యాచ్ ఔటయిపోయాడు. ఇక 19వ ఓవర్ తొలి బంతికి ఫినిషర్ దినేశ్ కార్తీక్ (6పరుగులు 7బంతుల్లో) కూడా ప్రసీద్ బౌలింగ్లో ఔటయిపోయాడు. ఆ తర్వాత బంతికే హసరంగా బౌల్డ్ అయ్యాడు. దీంతో స్కోరు బోర్డు మూమెంటమ్ పూర్తిగా దెబ్బతింది. చివర్లో షాబాజ్ అహ్మద్ (12పరుగులు 8బంతుల్లో 1సిక్సర్, 1ఫోర్) కాస్త పర్వాలేదనిపించాడు. దీంతో 20ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 157పరుగులు చేయగలిగింది.