ఐపీఎల్-2024లో ప్రీక్లైమాక్స్ ఫైట్ మొదలైంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ బెర్త్ను ఇప్పటికే సొంతం చేసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో టాప్-4లో మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి.
వాటిలో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమే. అయితే ఇవాళ జరగనున్న రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ల ఫలితాలతో ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్ ఎక్కనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. బెంగళూరుకు మరో మార్గం లేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఆ జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది. ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలుస్తోంది. అయితే రాజస్థాన్ చేతిలో సీఎస్కే ఓటమిపాలైతే పరిస్థితేంటి? చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందా?
ఆదివారం జరగనున్న మ్యాచ్లో సీఎస్కే ఓడినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. మే 18న ఆర్సీబీపై చెన్నై తప్పక విజయం సాధించాలి. అంతేకాక, ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. 12 మ్యాచ్లు ఆడిన చెన్నై 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ (-0.316), లక్నో సూపర్ జెయింట్స్ (-0.769) జట్లు కూడా 12 పాయింట్లే సాధించాయి. కానీ సీఎస్కే (+0.491)కు మెరుగైన రన్రేటు ఉండటంతో టాప్-4లో ఉంది.
అయితే ఇవాళ రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడితే, ఆర్సీబీ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓడిపోవాలి. ఒకవేళ బెంగళూరుపై ఢిల్లీ గెలిస్తే, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఢిల్లీ తప్పక పరాజయాన్ని చవిచూడాలి. మరోవైపు ఢిల్లీపై గెలిచిన లక్నో ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ఓటమిరుచి చూడాలి. ఇక అంతిమంగా బెంగళూరుతో జరిగే పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించాలి.
అప్పుడు ఢిల్లీ, లక్నో, సీఎస్కే సమానంగా 14 పాయింట్లు సాధిస్తాయి. ఢిల్లీ, లక్నో కంటే మెరుగైన స్థానంలో ఉండాలంటే, సీఎస్కే నెట్ రన్ రేటును గణనీయంగా పెంచుకోవాలి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నుంచి చెన్నై జట్టుకు పోటీ ఎదురవ్వకుండా ఉండాలంటే, గుజరాత్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఓడించాలి. అప్పుడు కేకేఆర్, రాజస్థాన్, హైదరాబాద్తో పాటు సీఎస్కే ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది.