ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. అంతేగాక నెట్రన్రేటును మెరుగుపర్చుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2x4, 4x6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు. అయితే గుజరాత్పై విజయం ఆర్సీబీకి ఊరట మాత్రమే కలిగిస్తుందని భారత మాజీ ఆల్రౌండర్ అజయ్ జడేజా అన్నాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంటుదనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డాడు.
''ఆర్సీబీ వెంటిలేటర్ నుంచి బయటపడింది. కానీ ఇంకా ఐసీయూలోనే ఉంది. గుజరాత్-బెంగళూరు మ్యాచ్లో విరాట్ కోహ్లి, డుప్లెసిస్ బ్యాటింగ్ను మనం ఎంతో ఆస్వాదించాం. కానీ ఈ మ్యాచ్లో అసలైన శ్రమ ఆర్సీబీ బౌలర్లది. వాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఆర్సీబీ బౌలింగ్ అసలు కథ ఇప్పుడే మొదలైంది. విజయాలు సాధించాలంటే ఇలాంటి ప్రదర్శనే కావాలి''
''బెంగళూరు జట్టు సరైన మార్గంలో పయనిస్తోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ దారి తప్పింది. అయితే అంతిమంగా ఎవరు గమ్యానికి చేరుకుంటారనేది ఇప్పుడే చెప్పడం కష్టం'' అని అజయ్ జడేజా పేర్కొన్నాడు. 11 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు చెరో ఎనిమిది పాయింట్లు సాధించాయి. అయితే నెట్రన్రేటు మెరుగ్గా ఉండటంతో ఆర్సీబీ ఏడో స్థానంలో, జీటీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.