ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రెండేళ్ల కోసం వచ్చి చేసిన పుణె, రాజ్కోట్ జట్లకు క్రీడాకారులు డ్రాఫ్టింగ్ డిసెంబర్ 15న ఇక్కడి బికెసి క్లబ్ హౌస్లో జరగనుంది. టీ20 ఫార్మెట్లో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీని ఏ జట్టు తీసుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది.
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దోషులను పేర్కొంటూ, శిక్షను ఖరారు చేసే పనిని లోధా కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించింది.
అదే విధంగా చెన్నై మాజీ సిఇఓ గురునాథ్ మెయప్పన్ను, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాను జీవితకాలం సస్పెండ్ చేసింది. కాగా, రెండేళ్ల సస్పెన్షన్ను ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ స్థానంలో ఆడేందుకు రెండు జట్లు అవసరంకాగా, ఈనెల ఎనిమిదో తేదీన 'రివర్స్ బిడ్డింగ్' విధానంలో పుణే, రాజ్కోట్ జట్లను ఖరారు చేశారు.

పుణె జట్టును సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్ సంస్థ సొంతం చేసుకుంది. అదే విధంగా రాజ్కోట్ జట్టును ఇంటెక్స్ మొబైల్స్ సంస్థ దక్కించుకుంది. చెన్నై, రాజస్థాన్పై వేటు పడడంతో, ఆ రెండు జట్లలోని ఆటగాళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారిని ఒక గ్రూపుగానూ, ఆడని వారిని మరో గ్రూపుగానూ విభజించారు.
డ్రాఫ్టింగ్లో ఒక్కో జట్టు ఒకదాని తర్వాత మరొకటిగా ఆటగాళ్లను ఖరారు చేసుకుంటుంది. తొలుత ఎంపిక చేసుకునే అవకాశం రివర్స్ బిడ్డింగ్లో తక్కువ మొతాన్ని కోట్ చేసిన పుణె జట్టుకు లభిస్తుంది.డ్రాఫ్టింగ్లో భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత మొత్తం లభిస్తుందనేది ఆసక్తిని రేపుతున్నది.
అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్ల నుంచి రెండు ఫ్రాంచైజీలు మొదట ఎంపిక చేసుకున్న వారికి 12.5 కోట్ల రూపాయలు చొప్పున లభిస్తాయి. ఆతర్వాత నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లను ఆ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
రెండు నుంచి ఐదు వరకూ వీరికి వరుసగా 9.5 కోట్లు, 7.5 కోట్లు, 5.5 కోట్లు, 4 కోట్ల రూపాయలు చొప్పున లభిస్తాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడని వారికి నాలుగు కోట్ల రూపాయలు చొప్పున దక్కే అవకాశం ఉంది. ఈ డ్రాఫ్టింగులో అమ్ముడుకాని ఆటగాళ్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న బెంగళూరులో వేలం ఉంటుంది.