
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ కోసం జరుగుతున్న రెండో రోజు వేలంలో సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనదఖ్త్ అరుదైన ఘనత సాధించాడు. జయదేవ్ ఉనాదఖ్త్ కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ. 11.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
కనీస ధర రూ. 1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన జయదేవ్ ఉనాదఖ్త్ అంతకు 10 రెట్లు అధికంగా అమ్ముడుపోవడం విశేషం. దీంతో ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఆటగాడిగా జయదేవ్ ఉనాదఖ్త్ నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించి తొలిరోజు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే భారత్ తరుపున అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాదఖ్త్ నిలిచాడు. గతేడాది ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక, హైదరాబాద్కు చెందిన పేసర్ మహమ్మద్ సిరాజ్ను రూ. 2.60 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది.
కౌల్టర్ నైల్ రూ. 2.2 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా, కర్ణాటక రంజీ జట్టు కెప్టెన్ వినయ్ కుమార్ను రూ. కోటితో కోల్కతా సొంతం చేసుకుంది. కాగా, ఆదివారం జరుగుతున్న రెండో రోజు వేలంలో పలువురు సీనియర్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా టీ20 స్పెషలిస్టులు అయిన ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తిచూపలేదు.
ఆసీస్ క్రికెటర్ షాన్ మార్ష్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తిని కనబర్చలేదు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోగా, వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్ను కూడా వేలంలో అమ్ముడుపోలేదు. స్టెయిన్ కనీస ధర రూ. 1 కోటి ఉండగా, సిమ్మన్స్ కనీస ధర రూ. 1.5 కోట్లగా ఉంది.
ఇప్పటి వరకూ అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు:
* బెన్ స్టోక్స్ - రూ.12.50 కోట్లు
* జయదేవ్ ఉనద్కత్ - రూ.11.50 కోట్లు
* మనీష్ పాండే - రూ.11 కోట్లు
* కేఎల్ రాహుల్ - రూ.11 కోట్లు
* క్రిస్ లిన్ - రూ.9.60 కోట్లు
* స్టార్క్ - రూ.9.40 కోట్లు
* మాక్స్వెల్ - రూ.9 కోట్లు