హైదరాబాద్: టీమిండియాకు యువ క్రికెటర్లను అందిస్తున్న రాహుల్ ద్రవిడ్ సందిగ్దంలో పడ్డాడు. ఎటో ఒకవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్ ఎ, అండర్-19 లాంటి జాతీయ జట్లకు ప్రస్తుతం ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు.
జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా రానున్న సీజన్ కోసం ఏడాది కాలానికి బీసీసీఐ త్వరలో కొత్త కాంట్రాక్టు విధానాన్ని తీసుకురాబోతున్నది. పరిపాలన కమిటీ (సీఓఏ) నూతన కాంట్రాక్టు విధానం ప్రకారం జోడు పదవుల్లో కొనసాగడం పరస్పర ద్వంద్వ ప్రయోజనాలు పొందినట్టు అవుతుంది.

దీంతో ద్రవిడ్ టీమిండియాకు సేవలందించాలనుకుంటే ఐపీఎల్ జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదు ఐపీఎల్ వద్దని అనుకుంటే జాతీయ జట్టుతో ఉండాల్సి వస్తుంది. బీసీసీఐతో ద్రావిడ్ కాంట్రాక్టును మరో 10 నెలలు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో దేశమా.. ఐపీఎలా..? ద్రవిడ్ ఎటువైపు మొగ్గుచూపుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే బీసీసీఐ కొత్త విధానంతో ద్రవిడ్కు వచ్చిన సమస్య ఏమీ లేదన్నది విశ్లేషకుల వాదన. ఐపీఎల్ ఫ్రాంచైజీకి పనిచేసినందుకుగానూ అతను ఎంత మొత్తం తీసుకుంటాడో అదే మొత్తాన్ని చెల్లించి అండర్-19 కోచ్గా కొనసాగాలని సూచించే అవకాశం ఉంది.
మరికొందరు జాతీయ సీనియర్ జట్టుతో ఉన్న సంజయ్ బంగర్, ఆర్ శ్రీధర్, ప్యాట్రిక్ ఫర్హాత్ కూడా ఐపీఎల్ జట్లతో కలిసి కొనసాగుతున్నాప్పటికీ... తాజాగా కొత్త కాంట్రాక్టులు పొందారని మరికొందరు వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ద్రవిడ్కు ఆ సమస్య ఎలా ఉత్పన్నమవుతుందని ప్రశ్నిస్తున్నారు.