ప్రతి ఏటా సుమారు రూ.30 కోట్లు
ఈ ఆరంభ వేడుకల కోసం బీసీసీఐ ప్రతి ఏటా సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అంతర్జాతీయ పాప్ సింగర్స్ పిట్ బుల్, ఎకాన్, కాటి పెర్రీల మేజర్ లేజర్ తో పాటు బాలీవుడ్లోని పలువురు బిగ్ స్టార్లు గతంలో పలు ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
బుధవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో మాజీ క్రికెటర్ బ్రిజేష్ పాటిల్ నాయకత్వంలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆరంభ వేడుకలపై చర్చించారు. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల వల్ల 'డబ్బు వృధా' అని ఈ వేడుకలను తొలగించాలని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
గత సీజన్ ఆరంభ వేడుకలు రద్దు
కాగా, గత ఐపీఎల్ సీజన్లో కూడా ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. ఐపీఎల్ ఆరంభ వేడుకలకు కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారల తళుకులతో ప్రతి ఏటా ఐపీఎల్ ఆరంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగే సంగతి తెలిసిందే.
మైదానంలో మరో అంఫైర్
దీంతో పాటు ఈ సమావేశంలో ఫ్రంట్ఫుట్, హైట్ నోబాల్స్పై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా అంపైర్ను నియమించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. "అంతా అనుకున్నట్లు సాగితే వచ్చే ఐపీఎల్లో ఎప్పుడూ ఉండే ఇద్దరు అంపైర్లకు తోడు మరో అంపైర్ మైదానంలో ఉంటాడు. నోబాల్స్ చూడటమే అతడి విధి. ఈ పద్ధతి చాలా విచిత్రంగా అనిపించవచ్చు" అని ఒకరు తెలిపారు.
ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని
తొలుత దీనిని ప్రయోగాత్మకంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు వచ్చే ఐపీఎల్కు ఎక్కువ సమయం లేనందున 'పవర్ ప్లేయర్'ను ఈసీజన్లో అమలు చేయడం కుదరదని గవర్నింగ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. పవర్ ప్లేయర్ నిబంధనకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆమోదముద్ర వేయలేదని సమాచారం తెలుస్తోంది.