
ఇప్పటికే ఎనిమిది.. ఇక 10
ఐపీఎల్లో ఇప్పటికే ఎనిమిది జట్లు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య పెరగబోతోంది. 10కి చేరుతుంది. దీనితో పాటు ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ఉంటుంది ఇకమీదట. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కత నైట్ రైడర్స్ జట్లకు తోడుగా మరో రెండు కొత్త టీమ్స్ రానున్నాయి.

భారత్-పాక్ మ్యాచ్ ముగిసిన నెక్స్ట్ డే
అక్టోబర్ 17వ తేదీన ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- 24వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే- బీసీసీఐ ఈ రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను వెల్లడిస్తుంది. ఫ్రాంచైజీలు, టీమ్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ను ప్రకటిస్తుంది.

అక్టోబర్ 10 వరకు గడువు
ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. అక్టోబర్ 25వ తేదీన రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఐపీఎల్లో ఇండక్ట్ అయ్యే రెండు కొత్త జట్ల వివరాలను వెల్లడించిన వెంటనే.. 2023-2027 మధ్యకాలానికి సంబంధించిన ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లను కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐపీఎల్ జట్ల కోసం ప్రతిపాదించిన ఇన్విటేషన్ టు టెండర్ గడువు అక్టోబర్ 10వ తేదీన ముగుస్తుంది.

ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్స్కు డిమాండ్..
నిజానికి- 5వ తేదీ నాడే ఈ టెండర్ల గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని ఇంకో అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఇదివరకే నిర్ధారించారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం ఆగస్టు 31వ తేదీన ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ టెండర్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 5వ తేదీని చివరి గడువుగా నిర్ధారించింది. దీన్ని 10వ తేదీ వరకు పొడిగించినట్లు జయ్ షా తెలిపారు.

రెండువేల కోట్ల బేస్ ప్రైస్..
ఒక్కో ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడానికి బీసీసీఐ 2,000 కోట్ల రూపాయలను బేస్ ప్రైస్గా నిర్ధారించినట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఇన్విటేషన్ టు టెండర్ను దాఖలు చేయాలంటే ఫ్రాంఛైజీలు 10 లక్షల రూపాయల మొత్తాన్ని నాన్ రీఫండబుల్ పేమెంట్గా బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. మధ్యలో టెండర్లను ఉపసంహించుకుంటే.. ఈ అమౌంట్ వెనక్కి రాదు. కొత్త ఫ్రాంఛైజీల కోసం ఇంకా రెండు వారాల పాటు గడవు ఉన్నందున.. మరిన్ని టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో ఎంట్రీ కావాల్సింది రెండు జట్లే కావడం వల్ల పోటీ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ముగ్గురికి మించకుండా కన్సార్టియం
ఒకే కంపెనీ ఫ్రాంఛైజీ కొనుగోలు కోసం అంత మొత్తాన్ని చెల్లించలేకపోతే.. కన్సార్టియంగా ఏర్పడవచ్చు. ఒక్కో కన్సార్టియంలో మూడు కంపెనీలకు మాత్రమే అవకాశం ఉంది. మూడుకు మించకూడదు. అలాగే- ఫ్రాంఛైజీ కొనుగోలు చేయదలిచిన కంపెనీ వార్షిక టర్నోవర్ కనీసం 3,500 కోట్ల రూపాయల వరకు ఉండాలి. 2,500 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కలిగి ఉండాలనే నిబంధనలను బీసీసీఐ విధించింది. కొత్త ఫ్రాంఛైజీల కోసం అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, కటక్, గువాహతి, ధర్మశాలను షార్ట్ లిస్ట్ చేసింది బీసీసీఐ.

రేసులో అదాని
కొత్త ఫ్రాంఛైజీల కోసం డజనుకు పైగా కంపెనీలు ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్లను కొనుగోలు చేసినట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ తెలిపింది. ఆర్పీ-సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) గ్రూప్, అరబిందో ఫార్మాసూటికల్, టోర్రెంట్ ఫార్మాసూటికల్స్, బ్రాడ్క్యాస్ట్ అండ్ స్పోర్ట్స్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఐటీడబ్ల్యూ, గ్రూప్ ఎం, సింగపూర్కు చెందిన ఈక్విటీ కంపెనీ ఇందులో ఉన్నట్లు తెలిపింది. గుజరాత్కు చెందిన పారిశ్రామిక దిగ్గజం అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని కూడా ఈ కేసులో ఉన్నారు. ఆయన ఇంకా టెండర్ డాక్యుమెంట్లను తీసుకోలేదని, అక్టోబర్ 10వ తేదీ వరకు గడువు ఉన్నందున.. ఆ లోగా వాటిని కొంటారని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications












