
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ కోసం మరో ఆటగాడి బదిలీ జరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడిన టీమిండియా ఆల్రౌండర్ జయంత్ యాదవ్ను ముంబై ఇండియన్స్ బదిలీ ద్వారా జట్టులోకి తీసుకుంది.
తాజా బదిలీతో ముంబై 25 మందితో తమ కోటాను పూర్తి చేయగా, ఢిల్లీ జట్టులో మరో ఖాళీ ఏర్పడింది. 2015 నుంచి ఢిల్లీ జట్టులోనే ఉన్న జయంత్ యాదవ్ మొత్తం 10 మ్యాచ్లు ఆడాడు. హర్యానాకు చెందిన జయంత్ యాదవ్ ఇటీవల ఎమర్జింగ్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.
టీమిండియా తరఫున జయంత్ యాదవ్ 4 టెస్టులు, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. జయంత్ను ముంబై జట్టులోకి తీసుకోవడంపై ఆ ఫ్రాంఛైజీ ఓనర్ ఆకాష్ అంబానీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జయంత్ యాదవ్ రాకతో జట్టు పూర్తి బ్యాలెన్స్గా ఉందని పేర్కొన్నారు. వేలానికి ముందే అర్సీబీ నుంచి క్వింటన్ డీకాక్ను ముంబై బదిలీ ద్వారా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇటీవలే జైపూర్ వేదికగా వేలం జరిగిన వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు.
ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి.