న్యూఢిల్లీ: వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొత్తగా ప్రవేశించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు యజమాని అయిన సంజీవ్ గోయెంకా ఈ మేరకు సోమవారం వెల్లడించారు.
పుణె జట్టు లోగోను కూడా ఆయన ఆవిష్కరించినట్లు తెలిపారు. రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టుకు ధోనీ కెప్టెన్గా ఉండటాన్ని తాను స్వాగతిస్తున్నానని సంజీవ్ చెప్పారు. భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన ధోనీ.. ఎన్నో విజయాలనందించారని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయంగా ధోనీ రికార్డు చెప్పుకోదగ్గదని చెప్పారు. ధోనీ నాయకత్వంలో తమ జట్టు విజయపథంలో నడుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2016 ఐపిఎల్ సీజన్లో తమ జట్టుకు ధోనీనే కెప్టెన్గా వ్యవహరిస్తాడని చెప్పారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లిసిస్, భారత ఆటగాళ్లు అజింక్యా రహానే, ఆర్ అశ్విన్లు ధోనీ నాయకత్వంలో ఆడనున్నారని తెలిపారు. వీరంతా స్నేహపూర్వకంగానే ఉంటారని చెప్పారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నవారంతా తమ జట్టులో ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఐఎస్ఎల్ ఫుట్ బాల్ ఫ్రాంఛైజీలో తన జట్టుకు సహ యజమానిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాత్ర ఈ క్రికెట్ జట్టుపై ఉండదని చెప్పారు.