
ఐపీఎల్ 2023కి ఇంకా కొన్ని నెలలు సమయం ఉన్నప్పటికీ ఆ ఫీవర్ అప్పుడే ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీన కొచ్చి వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తమ జట్ల నుంచి కొంతమంది ఆటగాళ్లను రిలీజ్ చేశారు. కొత్త ప్లేయర్స్ను కొనుగోలు చేసేందుకు వేలంపాట సందర్భంగా అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. అయితే గత సీజన్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఏ ప్లేయర్స్ను టార్గెట్ చేసే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.
గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసిన తొలిసారే విజేతగా నిలిచింది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్య నాయకత్వం వహించాడు. ఆ జట్టు కొనుగోలు చేసిన ప్లేయర్లను చూసి నాడు కొందరు విమర్శలు చేశారు. ఈ జట్టు టోర్నీలో నిలవగలదా అన్నవారు లేకపోలేదు. ఆ విమర్శలన్నిటికీ చెక్ పెడుతూ హార్ధిక్ పాండ్యా జట్టు విజయఢంకా మోగించి కప్ కైవసం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తర్వాత ఐపీఎల్ టోర్నీలో తొలిసారి అరంగేట్రం చేసి విజేతగా నిలిచిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఇక ఈ డిసెంబర్ 23న జరగబోయే వేలంపాటలో గుజరాత్ టైటాన్స్ పలువురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసింది.

ఐపీఎల్ సక్సెస్ తర్వాత కెప్టెన్గా హార్ధిక్ పాండ్య ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. అంతేకాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమైన సమయంలో భారత్ను విజయతీరాలకు చేర్చాడు పాండ్య. ఇక ఐపీఎల్ విషయానికొస్తే గత సీజన్లో 14 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్ ఆడగా అందులో 10 విజయాలను నమోదు చేసింది. 2023 సీజన్కు గుజరాత్ జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్,లాకీ ఫెర్జ్యూసన్, డామినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ అరోరాలను రిలీజ్ చేయగా వారు మరో ముగ్గురుని భర్తీ చేసుకునే అవకాశం ఉంది.గుజరాత్ జట్టు వద్ద రూ.19.25 కోట్లు మాత్రమే మిగిలి ఉంది.ఈ డబ్బుతోనే వారు ఆటగాళ్లను సర్దాల్సి ఉంటుంది.

మయాంక్ అగర్వాల్ బేస్ ప్రైస్ రూ.కోటిగా ఉంది.గతేడాది పంజాబ్ కెప్టెన్గా ఉన్నాడు.అయితే ఓపెనర్గా పనికొస్తాడని భావిస్తే గుజరాత్ జట్టు మయాంక్ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఐర్లాండ్కు చెందిన జాషువా లిటిల్ బేస్ ధర రూ.50 లక్షలు. ఫాస్ట్ బౌలర్గా టీ20 ప్రపంచ కప్లో సత్తా చాటాడు.గుజరాత్ జట్టు ఫెర్జ్యూసన్ను రిలీజ్ చేసింది కాబట్టి అతని స్థానంలో జాషువా లిటిల్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండర్ డేవిడ్ మలాన్ బేస్ ధర రూ.1.5కోట్లుగా ఉంది. టీట్వంటీ హైక్వాలిటీ బ్యాట్స్మెన్గా మలాన్కు మంచి గుర్తింపు ఉంది.

మొత్తానికి గుజరాత్ టైటాన్స్ దగ్గర ఉన్న తక్కువ డబ్బుతో ఎలాంటి ప్లేయర్స్ను టార్గెట్ చేస్తారో చాలా ఆసక్తికరంగా మారింది. మరోసారి ఐపీఎల్ టైటిల్ను హార్ధిక్ పాండ్య నాయకత్వంలో కుమ్మేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.