
ఐపీఎల్ జట్టుపై కన్నేసిన మాంచెస్టర్
కొత్త ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా ఐపీఎల్ జట్టు కొనేందుకు ఆసక్తి చూపిస్తోందని తాజాగా సమాచారం తెలుస్తోంది.
ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. మాంచెస్టర్ యునైటెడ్ గ్లేజర్ కుటుంబానికి చెందినది. అవ్రామ్ గ్లేజర్ మరియు జోయెల్ గ్లేజర్ మాంచెస్టర్ యునైటెడ్ యజమానులు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం ఈ క్లబ్ తరఫునే ఆడుతున్నాడు.

బీసీసీకి మరింత ఆదాయం
ఐపీఎల్ కొత్త జట్టు కోసం ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్ బిడ్ దాఖలు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ జట్టుపై ఆ క్లబ్ చాలా ఆశలు పెట్టుకుందంట. కొత్త జట్ల టెండర్కు సంబంధించిన చివరి తేదీని బీసీసీఐ అక్టోబర్ 20గా గతంలో నిర్ణయించింది. అయితే బుధవారంతో గడువు ముగిసింది. కానీ బీసీసీఐ ఈ చివరి తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది.
మాంచెస్టర్ యునైటెడ్ కోసమే గడువు పొడిగించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం ఐపీఎల్ జట్టును కొనుగోలు చేస్తే.. క్యాష్ రిచ్ లీగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని బీసీసీఐ భావిస్తోందట. ఏదేమైనా గ్లేజర్ కుటుంబం కొత్త జట్టును కొనుగోలు చేస్తే.. బీసీసీకి మరింత ఆదాయం రావడం మాత్రం పక్కా.
T20 World Cup: ఆహా.. ఏం ఆడారు! ప్రపంచకప్లో టీమిండియానే ఫెవరేట్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

మోహన్ లాల్ కూడా
ప్రముఖ బిజినెస్ మేన్ సంజీవ్ గోయెంకా ఆధ్వర్యంలోని ఆర్పీఎస్జీ కొత్త ఐపీఎల్ జట్టును కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. లక్నో జట్టుపై ఆర్పీఎస్జీ ఆసక్తి కనబరుస్తోంది. గతంలో రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సంజీవ్ గోయెంకా యజమాని అన్న సంగతి తెలిసిందే. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కూడా కొత్త ఐపీఎల్ జట్టు రేస్లో ప్రధానంగా ఉంది. ఐపీఎల్లో జట్టును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను అదానీ గతంలో బహిరంగంగానే ప్రకటించారు.
ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో ఉండడం.. ఆ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న అదానీ గ్రూప్నకు కలిసి రానుంది. మలయాళ 'సూపర్ స్టార్' మోహన్ లాల్ కూడా బరిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే బైజూస్ సంస్థతో కలిసి ఆయన కొత్త జట్టును కొంటాడా? లేదా సొంతంగానే తీసుకుంటాడనే విషయంపై స్పష్టత లేదు.

మొత్తం 74 మ్యాచులు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్ను 10 జట్లకు పెంచాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా.. సమయం లేకపోవడంతో అది కుదరలేదు. వచ్చే ఏడాది మాత్రం బీసీసీఐ ప్రయత్నాలు సఫలం కానున్నాయి.
మొత్తానికి ఐపీఎల్ మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సీజన్ నుంచి రెండు జట్లు చేరనుండడంతో బీసీసీఐకి భారీ ఆదాయం కూడా రానుంది.
ఐపీఎల్ 15వ సీజన్లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం. ప్రస్తుతం కంటే 1000, 15000 కోట్లు అదనంగా ఆదాయం రానుందని సమాచారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












