
హైదరాబాద్: ప్రదేశంతో పని లేదు. పలుకుబడి వాడుకొని ఇష్టారాజ్యంగా పనులు పూర్తి చేసేసుకుందామని కొందరు తెగ ఆశపడుతుంటారు. ఈ తరహాలోనే శనివారం ఉప్పల్ స్టేడియం వద్ద ఓ సంఘటన చోటు చేసుకుంది. టిక్కెట్లు లేకుండా ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అనుచరులను స్టేడియం బయట భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. చివరకు టిక్కెట్లు లేకున్నా మ్యాచ్ చూడనిచ్చేందుకు సన్రైజర్స్ యాజమాన్యం ఒప్పుకోవడంతో వివాదం సర్దుమణిగింది. ఎలాగైతే వాదనను గెలిచి ప్రశాంతంగా మ్యాచ్ను వీక్షించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మేయర్ బొంతు రామ్మోహన్తోపాటు ఆయన అనుచరులు మ్యాచ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందే రాజీవ్ గాంధీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. మేయర్తోపాటు కొందర్ని లోపలికి అనుమతించిన భద్రతా సిబ్బంది, మిగతా వాళ్లను అడ్డుకున్నారు.
దీంతో సెక్యూరిటీ స్టాఫ్, పోలీసులతో వారు గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ అసిస్టెంట్, అంతకు ముందే లోపలికి వెళ్లిన అనుచరులు బటయకొచ్చి బారియర్లు పగలగొట్టారు. పోలీసులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ నిస్సహాయులై చూస్తూ ఉండిపోయారు.
మేయర్ 20 మంది అనుచరులతో స్టేడియానికి వచ్చారని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు. 'తమకు మ్యాచ్ పాసులు ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేశారు. వీఐపీల కోసం సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి. ఆ పాసులను ముందే తీసుకొని ఉంటే ప్రశాంతంగా మ్యాచ్ చూడొచ్చు. కానీ వారు ఆ పాసులను ముందుగా తీసుకోలేదని అలా తీసుకుని ఉంటే సమస్య ఉండేది కాదని'ని ఓ భద్రతాధికారి వ్యాఖ్యానించారు.