హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 19 పరుగుల తేడాతో గెలిచింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌటైంది.

బెంగళూరు ఆటగాళ్లలో మన్దీప్ సింగ్(46) తప్ప మిగతా ఎవరూ రాణించలేదు. బెంగళూరు స్టార్ ఆటగాళ్లు క్రిస్ గేల్ డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 6, డివిలియర్స్ 10 పరుగులకే పెవిలియన్కు చేరారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మోహిత్ శర్మ, మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.
బెంగళూరు విజయ లక్ష్యం 139
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకి 139 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుతు బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆది నుంచి తడబడింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(1), మార్టిన్ గప్టిల్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. జట్టు స్కోరు 18 వద్ద మార్టిన్ గప్తిల్(9) వికెట్ కూడా కోల్పోవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ (20), మనన్ వోహ్రా(25) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే పవన్నేగి వేసిన ఏడో ఓవర్లో మార్ష్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ మాక్స్వెల్ పదకొండు బంతులాడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.
ఈ దశలో పంజాబ్ 13.5 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న సాహా(21)ను జట్టు స్కోరు 112 వద్ద వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో మోహిత్ శర్మ 6 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (38) రెండు ఫోర్లు, సిక్సర్ బాది 19 పరుగులు రాబట్టడంతో పంజాబ్ 138 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో అంకిత్ చౌదరి, చాహల్లు చెరో రెండు వికెట్లు సాధించగా, అరవింద్, షేన్ వాట్సన్, పవన్ నేగీలు తలో వికెట్ తీశారు.
పంజాబ్పై ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుని పంజాబ్ని బ్యాటింగ్కు ఆహ్వానించింది.
బెంగళూరు జట్టులో స్వప్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హెడ్, మిల్నే స్ధానంలో ఫామ్లేమితో ఇబ్బంది పడుతూ చివరి మ్యాచ్కు దూరమైన క్రిస్ గేల్తో శామ్యూల్స్ బద్రీని తుది జట్టులోకి తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్లు మాక్స్వెల్ పేర్కొన్నాడు.

పంజాబ్కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ బరిలో నిలుచోవాలని యోచిస్తోంది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్లో పది వికెట్ల తేడాతో విజయం సాధించి పంజాబ్ జట్టు మంచి ఊపు మీద ఉంది. మరోవైపు ఈ సీజన్లో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్కు దూరమైన బెంగళూరు పరువు కోసం ఈ మ్యాచ్లో గెలవాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), మన్దీప్ సింగ్, డివీలియర్స్, కేదార్ జాదవ్(వికెట్ కీపర్), షేన్ వాట్సన్, పవన్ నేగి, శ్రీనాథ్ అరవింద్, శామ్యూల్ బ్రదీ, అంకిత్ చౌదరి, యజ్వేంద్ర చాహల్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
మార్టిన్ గుప్తిల్, హషీమ్ ఆమ్లా, మనన్ వోహ్రా, షాన్ మార్ష్, గ్లేన్ మాక్స్వెల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, సందీప్ శర్మ, టి నటరాజన్.