చెన్నై సూపర్ కింగ్స్కు లక్నో సూపర్ జెయింట్స్ మరో షాక్ ఇచ్చింది. గత మ్యాచ్లో సొంతమైదానంలో సీఎస్కేను ఓడించిన లక్నో, చెపాక్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లోనూ విజయకేతనం ఎగురవేసింది. భారీ లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. చెన్నైని వెనక్కినెట్టి టాప్-4లోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108*; 60 బంతుల్లో, 12x4, 3x6) అజేయశతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబె (66; 27 బంతుల్లో, 3x4, 7x6) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
స్టొయినిస్ (124*; 63 బంతుల్లో, 13x4, 6x6) విధ్వంసం సృష్టించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నికోలస్ పూరన్ (34; 15 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ క్రమంలో స్టొయినిస్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ ఛేజింగ్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ (124*) చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011లో మొహాలి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో పాల్ అజేయంగా 120 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ (119), సంజు శాంసన్ (119), షేన్ వాట్సన్ (117*) ఉన్నారు.
ఇక సీఎస్కే జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సెహ్వాగ్ పేరిట ఈ ఘనత ఉంది. 2014 సీజన్లో వాంఖడే వేదికగా జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్లో సెహ్వాగ్ 122 పరుగులు చేశాడు. పదేళ్ల తర్వాత ఈ రికార్డు బద్దలైంది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా స్టొయినిస్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో డికాక్ (140*) ఉన్నాడు. స్టొయినిస్ (124*) తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్ (103*) ఉన్నాడు.