ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వల్లే తన కెరీర్ నాశనమైనందని పేర్కొన్న తివారీ తాజాగా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి కీలక విషయాలు మాట్లాడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్తో తన కాంట్రాక్టు తొందరగా ముగియడానికి గంభీర్ కారణమని మనోజ్ తివారీ ఆరోపించాడు. గంభీర్తో గొడవ జరగకపోతే తన కాంట్రాక్టును మరి కొన్నాళ్లు పొడగించేవారని అన్నాడు.
''ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్తో పెద్ద గొడవ జరిగింది. అయితే ఆ విషయం వెలుగులోకి రాలేదు. 2012లో కేకేఆర్ ఛాంపియన్గా నిలిచింది. 2013లో గంభీర్తో గొడవ జరగకపోతే మరో రెండు నుంచి మూడు ఏళ్లు ఆడేవాడిని. అంటే నా కాంట్రాక్ట్ మరికొంత కొనసాగి నాకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేవి''

''కానీ అలా జరగలేదు. అయితే వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. గంభీర్తో గొడవ జరిగినప్పుడు అతడు 'బయట చూసుకుందాం.. ఈ రోజు నువ్వు అయిపోతావ్' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దానికి నేను.. ఓకే అంటూ నవ్వుతూ బదులిచ్చా. అవన్నీ పరిణితిలేనితనం వల్ల వచ్చిన గొడవలు'' అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు. కేకేఆర్ తరఫున 2010 నుంచి 2013 వరకు మనోజ్ తివారీ ప్రాతినిథ్యం వహించాడు. 2012 ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు ఢిల్లీ ప్రాంచైజీ తరఫున ఆడాడు.
అయితే ఢిల్లీ తుదిజట్టు ఎంపిక చూసి విసుగుచెందానని తివారీ పేర్కొన్నాడు. ''ఢిల్లీ తరఫున ఆడుతున్నప్పుడు గ్యారీ క్రిస్టన్ కోచ్గా ఉన్నాడు. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లు సరిగా ఆడట్లేదు. ఎన్నో మ్యాచ్ల్లో గమనించాను. జట్టు కాంబినేషన్ అసలు బాగోలేదు. అర్హులైన క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వలేదు. చాలా మందికి గాయలయ్యాయి. మ్యాచ్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇక వాళ్ల దగ్గరికి నేరుగా వెళ్లి.. తుది జట్టులో ఎంపిక చేయకపోతే ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ చేయండి అని చెప్పాను.అప్పుడు నా కాంట్రాక్ట్ రూ.2.8 కోట్లు. అలా చెప్పినందుకు నన్ను అపార్థం చేసుకోరని భావించాను'' మనోజ్ తివారీ తెలిపాడు.