మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. కొత్త ఆటగాళ్లతో సరికొత్త ఉత్సాహంతో టైటిల్ ఫేవరేట్గా అన్ని జట్లూ బరిలోకి దిగుతున్నాయి. మార్చి 22 నుంచి మొదలుకానున్న ఈ మెగా లీగ్ మే 26న ఫైనల్తో ముగుస్తుంది. గతసీజన్లో మాదిరిగానే ఈ సారి పది జట్లు తలపడుతున్నాయి. ఎలాంటి కొత్త నిబంధనలు, మార్పులేమీ లేవు.
కాగా, ఐపీఎల్ మ్యాచ్లను మొబైల్లో జియో సినిమా యాప్లో ఉచితంగా వీక్షించవచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. గతేడాది కూడా ఇలానే ఫ్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్వహించే 'ఆర్సీబీ అన్బాక్స్' ఈవెంట్ను మాత్రం ఫ్రీగా చూడలేరు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 19న ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ జరగనుంది. ఆరు గంటల పాటు జరగనున్న ఈ ఈవెంట్ను లైవ్లో చూడటానికి రూ.99 చెల్లించాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకను స్టేడియంలో వీక్షించడానికి టికెట్ ధరలు రూ.800 నుంచి రూ.4000 వరకు ఉన్నాయి.
అన్బాక్స్ ఈవెంట్కు స్టార్ క్రికెటర్లతో పాటు రిషభ్ శెట్టి, అశ్విని పునీత్, శివరాజ్ కుమార్, రష్మిక మంధాన వంటి తారలు కూడా హాజరవుతున్నారు. అలన్ వాకర్, రఘు దీక్షిత్, నీతి మోహన్, జోర్డిండియన్, బర్ఫీ వంటి సెలబ్రెటీలు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరును మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే రెండు నెలలు పాటు ఐపీఎల్ను ఫ్రీగా చూడటానికి అవకాశం ఇచ్చి, ఈ ఈవెంట్కు డబ్బులు తీసుకోవడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లాయల్ ఫ్యాన్స్కు ఇది అన్యాయమని ఆర్సీబీ అభిమానులు కూడా మండిపడుతున్నారు. మిగిలిన ఫ్రాంచైజీలు తమ ఈవెంట్లను చూడటానికి అభిమానులకు ఫ్రీగా అవకాశం ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.