

హైదరాబాద్: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. బుధవారం వాంఖడె వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఇది 100వ విజయం కావడం విశేషం. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది.
170 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాధవ్(58)తో కలిసి ధోని(12) నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశారు. అయితే, హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ధోని(12), జడేజా(1) పెవిలియన్కు చేరారు.
ఆ తర్వాత లసిత్ మలింగ వేసిన 18వ ఓవర్లో జాదవ్(58), బ్రావో(8) కూడా ఔట్ కావడంతో చెన్నై ఓటమికి చేరువ అయింది. చివర్లో శార్దుల్ ఠాకుర్(12) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఓటమి నుంచి చెన్నైని కాపాడలేకపోయాడు.
అంతకముందు సూర్యకుమార్ యాదవ్(59; 43 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్), కృనాల్ పాండ్యా (42; 32 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్ (4), రోహిత్శర్మ(13) చక్కటి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన యువరాజ్ సింగ్(4) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరడంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(59)తో కలిసి కృనాల్ పాండ్యా(42) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నిలికడగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడే క్రమంలో డ్వేన్ బ్రావో బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోరుకే పరిమితం అవుతుందని అంతా భావించారు.
అయితే, చివర్లో హార్ధిక్ పాండ్యా (19; 8 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులు), పొలార్డ్ (17; 7 బంతుల్లో 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చెన్నై 170 పరుగులు చేసింది. డ్వేన్ బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో ముంబై బ్యాట్స్మెన్ 29 పరుగులు పిండుకున్నారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మోహిత్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ వాంఖడె పిచ్ స్పిన్నర్లకు సహకరించేలా కనిపించడం లేదని చెప్పాడు. మరోవైపు రోహిత్ శర్మ సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకుంటానని చెప్పాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమెరగని సీఎస్కేని సొంతగడ్డపై ఓడించాలని ముంబై ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్లో గెలిచి, రెండింట పరాజయం పాలైంది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు మంచి రికార్డు ఉన్నా... ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన గణాంకాలను చూస్తే ఈ విషయం తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్లు ఆడగా... అందులో 13సార్లు ముంబై, 11 సార్లు చెన్నై విజయం సాధించింది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జాసన్ బెహ్రాన్డార్ఫ్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
చెన్నై సూపర్ కింగ్స్:
అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మెహిత్ శర్మ, ఇమ్రాన్ తాహిర్