
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మెన్ పరుగుల సునామీ సృష్టించారు. ఈ మ్యాచ్లో ఆండ్రీ రసెల్ (48: 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు), రాబిన్ ఉతప్ప (67 నాటౌట్: 50 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు), నితీశ్ రాణా (63: 34 బంతుల్లో 2 ఫోర్లు, 7 ఫోర్లు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
కోల్కతా ఓపెనర్ క్రిస్లిన్ (10) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ సునీల్ నరైన్ (24) క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీల మోత మోగించాడు. ఓవర్ వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా మూడో వికెట్కి అభేద్యంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
జట్టు స్కోరు 146 వద్ద రాణా ఔటవగా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రస్సెల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. నిజానికి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 4 పరుగుల వద్ద రస్సెల్ ఔటయ్యాడు. మహ్మద్ షమీ విసిరిన యార్కర్కు క్లీన్ బౌల్డయ్యాడు. అయితే, 30 అడుగుల సర్కిల్లో ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండంతో ఆ బంతిని అంపైర్ నోబాల్గా ప్రకటించాడు.
తనకు లభించిన లైఫ్తో రస్సెల్ పరుగుల సునామీ సృష్టించాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, వరుణ్ చక్రవర్తి, విజిలియన్, ఆండ్రూ టై తలో వికెట్ తీశారు. అంతకముందుటాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.
గత మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చిన సామ్ కర్రన్ స్థానంలో హర్దుస్ విలోజెన్కు అవకాశం కల్పించింది. మరోవైపు డేవిడ్ మిల్లర్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. మన్కడిండ్ వివాదం జరుగుతున్న మ్యాచ్ కావడంతో అందరి దృష్టి పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్పైనే ఉంది.
కోల్కతా నైట్రైడర్స్కు సొంతగడ్డపై ఇది రెండో మ్యాచ్ కావడం విశేషం. కోల్కతా తుది జట్టులో కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే ఇరు జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్ల్లో గెలిచి శుభారంభం చేశాయి.