హైదరాబాద్: దేశీ క్రికెట్ పండుగ ఐపీఎల్.. జరిగిన రెండు నెలల పాటు సమయం రెండు రోజుల్లాగే గడిచిపోయింది క్రికెట్ అభిమానులకు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవంతో మొదలై.. ట్రోఫీ గెలిచే మ్యాచ్ వరకూ అదే ఉత్కంఠతో లీగ్ కొనసాగింది. అదిరిపోయే షాట్లు, మెరుపు వేగంతో దూసుకొచ్చే బంతులను క్యాచ్ అందుకున్న తీరు, సరదా రనౌట్లు ఇలా పలు రకాలుగా క్రీడాభిమానులను ఆకట్టుకున్న ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అనే ప్రశ్న లేకపోలేదు.
ఈ క్రమంలో బీసీసీఐ కూడా ఈ విషయంపై ఓ కన్నేసింది. మరో పది నెలల్లో ఆరంభం కానున్న ఐపీఎల్-12 సీజన్కు అప్పుడే సన్నాహాలు మొదలైయ్యాయి. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది మే 30న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ కన్నా ముందే ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.
లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఐపీఎల్కు, ఏదైనా క్రికెట్ టోర్నీ మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే నెల తొలి రెండు వారాల్లోపు ఐపీఎల్ను నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ 2019, మార్చి 29న ఐపీఎల్-12 సీజన్ను ఆరంభించాలని సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల షెడ్యూల్ను బట్టి ఐపీఎల్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాగే అంతకుముందు 2014లో ఓసారి సాధారణ ఎన్నికల సమయంలో కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచ్లను 19 రోజుల పాటు యూఏఈ వేదికగా నిర్వహించారు.