ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి 21 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ వచ్చింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లకు వేదికలు, తేదీలు ఖరారు కాలేదు. ఎన్నికల ప్రభావం మ్యాచ్లపై పడకుండా లీగ్ను నిర్వహించేలా ఐపీఎల్ నిర్వాహకులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.
అయితే గత సీజన్లో బరిలోకి దిగిన పది జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడిన విషయం తెలిసిందే. కానీ ఈ సీజన్లో ఏ గ్రూప్లో ఏఏ జట్లు ఉన్నాయనే విషయం గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇవాళ గ్రూప్లపై క్లారిటీ వచ్చేసింది. గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి.

గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంబాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం గ్రూప్ స్టేజ్లో ప్రతి జట్టు తమ గ్రూప్లో ఉన్న టీమ్స్తో ఒక్కసారి తలపడతాయి. అలాగే ఇతర గ్రూప్ల్లో ఉన్న జట్లతో మాత్రం రెండు సార్లు తలపడతాయి.
ఉదాహరణకు.. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ గ్రూప్-బిలో ఉంది. కాబట్టి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టు.. సీఎస్కే, ఆర్సీబీ, పంబాజ్, గుజరాత్ జట్లతో ఒక్కసారి మాత్రమే పోటీపడతాయి. కానీ 'గ్రూప్-ఎ'లో ఉన్న ముంబై, కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో టీమ్స్తో రెండు సార్లు తలపడతాయి. అలా మొత్తం 14 గ్రూప్ మ్యాచ్లు ఆడతాయి.
కాగా, మరో రెండు మూడు రోజుల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ప్లేఆఫ్స్ మ్యాచ్లు, ఫైనల్ వేదికలు ఫిక్స్ అయినట్లు సమాచారం. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్తో పాటు ఎలిమినేటర్-2కు కూడా చెపాక్ ఆతిథ్యం ఇవ్వనుందని సమాచారం. మరోవైపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా క్వాలిఫయిర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయని తెలుస్తోంది.