హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు మంగళవారం కోల్కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2017వ సీజన్లో పాక్ లెజెండ్ వసీం అక్రమ్ స్ధానాన్ని బౌలింగ్ కోచ్గా బాలాజీ భర్తీ చేయనున్నాడు.
కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్గా 2010లో నియమితుడైన వసీం అక్రమ్ ఆ జట్టు 2012, 2014లో టైటిల్స్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ముందే కమిట్ అయిన కొన్ని కార్యక్రమాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్-2017 సీజన్కు తాను అందుబాటులో ఉండనని అక్రమ్ తెలిపాడు.

దీంతో అక్రమ్ స్ధానంలో బౌలింగ్ కోచ్గా బాలాజీని నియమించినట్లు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఎండీ, సీఈఓ వెంకీ మైసూర్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేకేఆర్ ఫ్యామిలీలోకి బాలాజీని సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నాడు.
ఇక, లక్ష్మీపతి బాలాజీ 2011 నుంచి 2013 వరకు కోల్కతాకు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. బాలాజీ 2016 సెప్టెంబరులో ఫస్ల్క్లాస్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. బాలాజీ ప్రస్తుతం తమిళనాడు రంజీ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.