
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్కు సన్నద్ధం అయ్యేందుకు భారత ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశమని ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా తెలిపారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ సందర్భంగా అర్సీబీ బౌలింగ్ కోచ్ నెహ్రా మాట్లాడుతూ "ఐపీఎల్ అనేది అతిపెద్ద క్రికెట్ ఈవెంట్. ఇందులో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచులతో సమానంగా ఐపీఎల్ నిలుస్తుంది. కాబట్టే ప్రతీ ఆటగాడు ఐపీఎల్లో ఆడాలనుకుంటాడు. ఐపీఎల్ ఆడకుండా కోహ్లీని నేరుగా వరల్డ్కప్కు ఆడమనడం సరికాదు" అని అన్నాడు.
"ఒత్తిడిని జయించాలి. ఐపీఎల్ ఫైనల్ తర్వాత భారత్కు మూడు వారాల సమయం ఉంది. భారత్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ ఆటగాళ్లు గాయాలబారిన పడకుంటే మూడు వారాల సమయం సరిపోతుంది. ఐపీఎల్ ఫైనల్లో ఆడి మూడు వారాలు విశ్రాంతి తీసుకొని మళ్లీ వరల్డ్కప్లో నేరుగా దక్షిణాఫ్రికాకు బౌలింగ్ చేయమంటే నేను అందుకు ఇష్టపడను" అని అన్నాడు.
"వరల్డ్కప్కు ముందు ప్రతీ ఆటగాడికి సరైన విశ్రాంతి అవసరం. ఒక బౌలర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యార్కర్లు, మంచి బంతులేసేందుకు ప్రయత్నించాలి. అలాగే వరల్డ్కప్లోనూ అలాంటి బంతులే వేయాలి. కొన్ని రోజులు ఇంట్లో కూర్చొని నేరుగా వరల్డ్కప్లో ఆడతానంటే సరిపోదు, అది సరైన నిర్ణయం కాదు" అని నెహ్రా తెలిపాడు.