తెలుగు టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఎఫెక్ట్కు ఐపీఎల్లో రూల్స్ ఛేంజ్ చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. బౌలర్లను రక్షించుకునే పనిలో పడ్డారని సమాచారం. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ 11 ఏళ్ల 262 స్కోరు రికార్డును ఈ సీజన్లో సన్రైజర్స్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది.
హైదరాబాద్ టీమ్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ రికార్డును ఓ సారి బద్దలుకొట్టింది. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 ఇన్నింగ్స్ స్కోర్ జాబితాలో నాలుగు స్కోర్లు ఈ ఏడాదే నమోదవ్వడం విశేషం. ఈ సీజన్లో 287/3 (ఎస్ఆర్హెచ్), 277/3 (ఎస్ఆర్హెచ్), 272/7 (కేకేఆర్), 266/7 (ఎస్ఆర్హెచ్) అత్యధిక స్కోర్లు నమోదయ్యాయి.

అయితే భారీ స్కోర్లు నమోదవ్వడానికి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్ కూడా ఓ కారణం. ఈ నిబంధనతో బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా ఊహించని స్కోర్లు నమోదవుతున్నాయి. బ్యాటు-బంతికి సమానమైన పోటీ ఉండాలనే ఉద్దేశంతో ఓ ఓవర్లో రెండు బౌన్సర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ అది బౌలర్లకు ఉపశమనం ఇవ్వలేదు. దీంతో రూల్స్లో మార్పులు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం బౌండరీ దూరాన్ని పెంచాలని సూచించాడు.
అయితే బౌలర్లకు అనుకూలంగా నిబంధనలు తీసుకురావాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఒక్క బౌలర్కు గరిష్ఠంగా అయిదు ఓవర్లు, మిగిలిన వాళ్లకు నాలుగు ఓవర్ల పరిమితి అలానే కొనసాగించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి బౌలర్ నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలడు. మరో ఓవర్ అదనంగా ఇస్తే.. స్టార్ బౌలర్లు ఉన్న జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఉదాహరణకు బుమ్రా అయిదు ఓవర్లు బౌలింగ్ వేస్తే అది ముంబై ఇండియన్స్కు ఎంతో సానుకూలంగా కచ్చితంగా మారుతుంది.
జట్టులో బ్యాటర్లను కట్టడి చేసే బౌలర్ కనీసం ఒకరు ఉంటారు. ఇన్నింగ్స్లో పావు వుంతు బంతుల్ని వాళ్లే సంధిస్తే.. స్కోరును కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అది ఫాస్ట్ బౌలర్లపై కచ్చితంగా పనిభారం పెంచుతుంది. అవిరామంగా ఆడే ఐపీఎల్లో అన్ని ఓవర్లు వేయడం ఫిట్నెస్ సమస్యకు దారితీసే అవకాశాలూ ఉంటాయి. దీని గురించి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.