
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు కొత్త ప్రచారం ఊపందుకుంది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ మాదిరి ఆటగాళ్లు జట్టును మార్చుకునే 'మిడ్ డే టోర్నమెంట్ ప్లేయర్ ట్రాన్స్ఫర్' నిబంధనను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ నిబంధన ప్రకారం జట్టులోని ఆటగాడికి ఆ సీజన్లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో ప్రాంఛైజీ అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా మిగతా జట్లలోకి వెళ్లొచ్చు. అయితే ఈ నిబంధన ఆటగాడి పట్ల మిగతా ప్రాంచైజీలు ఆసక్తిని కనబరిచినప్పుడే సాధ్యమవుతుంది.
ఈ నిబంధనను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 11వ సీజన్లో అమలు చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియాకు చెందిన ఓ పత్రికలో వచ్చింది. కాగా, మంగళవారం ముంబైలో బీసీసీఐ-ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయానికి ప్రాంచైజీ యజమానులు అంగీకరించారని కూడా ఆ పత్రిక తన వార్త కథనంలో పేర్కొంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానంపై చర్చ జరిగింది. అట్టిపెట్టుకునే విధానాన్ని రద్దు చేయాలని రాజస్థాన్ రాయల్స్ సూచించింది.
కనీసం ఇద్దరు ప్లేయర్లను అట్టిపెట్టుకోవాలని పంజాబ్ ఫ్రాంచైజీ సూచించగా, మూడు నుంచి ఐదుగురు ఉండాల్సిందేనని ఇతర ఫ్రాంచైజీలు స్పష్టం చేశాయి. మరోవైపు వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్ వేలంలో రిటెన్షన్ పాలసీతో పాటు రైట్ టు మ్యాచ్ ఉండాల్సిందేనని ఫ్రాంచైజీలు పట్టుబట్టాయి.
వేలాన్ని ఇంగ్లండ్లో జరుపాలని రెండు ఫ్రాంచైజీలు సూచించిన ఆలోచనకు ఆదిలోనే చుక్కెదురైంది. ఫ్రాంచైజీల జీతాల పరిమితిని రూ. 60 నుంచి 75 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనకు దాదాపు ఆమోద ముద్ర పడింది. అన్ని ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారని, చర్చించిన విషయాలపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.