గత 16 సీజన్లకు భిన్నంగా ఐపీఎల్-2024 సాగుతోంది. బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం. ఈ సీజన్లో బౌలర్లు నిస్సహాయులుగా, ఫీల్డర్లు ప్రేక్షుకులుగా మారిన మ్యాచ్లు ఎన్నో! అంతేగాక సగం లీగ్ పూర్తికాకముందే రికార్డులు బద్దలవుతూ నయా చరిత్ర లిఖించబడుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డులు రోజుల వ్యవధిలో బ్రేక్ అవుతున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ 277, 287 స్కోర్లతో కొత్త చరిత్ర సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు కూడా భారీ స్కోర్లు సాధించాయి. బ్యాటర్ల ఈ విధ్వంసానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఓ కారణమని చర్చ జోరుగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఈ విషయాన్ని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యతిరేకించాడు. ఈ నిబంధన భారత క్రికెట్కు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లను వెలుగులోకి రాకుండా తెస్తుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని అన్నాడు. ''ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్కు నేను వీరాభిమానిని కాదు. ఇది ఆల్రౌండర్లను హోల్డ్లో ఉంచుతోంది. దూబె, సుందర్ వంటి వాళ్లు బౌలింగ్ చేయనివ్వకుండా చేస్తుంది. ఇది మనకే మంచిది కాదు. ఈ రూల్తో 12 మంది ప్లేయర్లతో ఆట వినోదాత్మకంగా మారింది. జట్టులో ఎన్నో ఆప్షన్లు ఉంటున్నాయి'' అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఆల్రౌండర్లకు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఐపీఎల్లో ఆల్రౌండర్ కేవలం బ్యాటర్ లేదా బౌలర్గా మాత్రమే జట్టులో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సీజన్లో దూబె బ్యాటుతో అద్భుతాలు చేస్తున్నప్పటికీ బంతిని అందుకోలేకపోయాడు. అయితే మరో నెలన్నర రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత్కు ఆల్రౌండర్లను ఎంపిక చేయడంలో ఈ నిబంధన ఆటంకంగా మారుతోంది. ఆల్రౌండర్ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సెలక్టర్లకు తలనొప్పిగా మారింది.