కెప్టెన్సీ మార్పు వివాదంతో ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ వీడనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సీజన్ ముగిసిన అనంతరం జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ పాల్గొనున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ను కాదని జట్టు బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించిన తెలిసిన విషయం తెలిసిందే.
అయితే హార్దిక్కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని, హిట్మ్యాన్తో పాటు జట్టులోకి కొందరు కీలక సభ్యులు కూడా అయిష్టంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబైను రోహిత్ వీడనున్నట్లు, అతని కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై సరైన ఆధారాలు లేకపోవడంతో ఇవన్నీ ఫ్యాన్ థీరిస్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు.

కానీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం ఇవన్నీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపాడు. రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు కూడా వెళ్లొచ్చని అన్నాడు. ''చెన్నై సూపర్ కింగ్స్కు రోహిత్ వెళ్తాడా? ధోనీ స్థానాన్ని అతడు తీసుకుంటాడా? ఈ సీజన్ వరకే రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తున్నారేమో. ఆ స్థానాన్ని వచ్చే ఏడాదికి రోహిత్కు ఇవ్వొచ్చేమో. రోహిత్ను మనం సీఎస్కేలో కూడా చూడొచ్చు ఏమో!''

''ఇది నిజమైతే ముంబై ఇండియన్స్ అభిమానుల గుండె బద్దలైనట్లే. ఈ విషయం వాళ్లక చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే రోహిత్ సన్రైజర్స్ హైదరాబాద్కు వెళ్లడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. గతంలో రోహిత్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్కు హిట్మ్యాన్ ఆడటం రొమాంటింక్గా ఉంటుంది'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.కాగా, 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ 45 మ్యాచ్లు ఆడాడు. 30 సగటుతో 890 పరుగులు సాధించాడు. అంతేగాక ముంబై ఇండియన్స్పైనే రోహిత్ హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.