
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా శనివారం మొహాలిలోని పంజాబ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు విజయాన్ని అందుకుంది. ఆ జట్టు బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ (71 నాటౌట్: 57 బంతుల్లో 6x4, 1x6) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. అనంతరం చేధనకు దిగిన పంజాబ్ జట్టులో క్రిస్ గేల్(40; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆరంభాన్నివ్వగా, కేఎల్ రాహుల్(71నాటౌట్; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) చివరివరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. మయాంక్ అగర్వాల్(43; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఫరవాలేదనిపించాడు.
అంతకముందు ముంబై ఓపెనర్ క్వింటన్ డీకాక్ (60; 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబైకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్లు ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించారు.
వీరిద్దరూ 5.2 ఓవర్లు ముగిసే సరికి 51 పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ(32) తొలి వికెట్గా పెవిలియన్కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న సమయంలో రోహిత్ను విజియోన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(11) నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్ 62 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది.
ఈ క్రమంలో డీకాక్-యువరాజ్ సింగ్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన క్వింటన్ డీకాక్ వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ముంబై భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోన్న సమయంలో షమీ బౌలింగ్లో డీకాక్ ఔటయ్యాడు. డీకాక్ ఔటైన తర్వాత మరో ఆరు పరుగుల వ్యవధిలో యువీ(18) కూడా ఔటయ్యాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే పొలార్డ్ (7) కూడా పెవిలియన్కు చేరాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (31, 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో మెరుపులు మెరిపించడంతో ముంబై 170 పరుగుల మార్కును అందుకోగలిగింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, విజియోన్, మురుగన్ అశ్విన్ తలో రెండు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై వికెట్ తీశాడు.