పోటీ పడలేకపోయిన అదాని..
కొత్త ఐపీఎల్ ఫ్రాంఛైజీని సాధించలేక చతికిల పడిన దేశీయ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ అదాని గ్రూప్- దాన్ని దక్కించుకున్న సీవీసీ కేపిటల్ను లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీని దక్కించుకోవడానికి సీవీసీ కేపిటల్ ధారపోసిన వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీసింది. ఆ సంస్థ యాజమాన్యానికి అక్రమ లావాదేవీలు ఉన్నాయని అదాని గ్రూప్ ఆరోపించింది. అక్రమంగా సాధించిన సొమ్మును ఇలా ఐపీఎల్ ఫ్రాంఛైజీని సాధించడానికి ఖర్చు చేసిందని విమర్శించింది.
160 శాతం ఎక్కువగా..
అహ్మదాబాద్కు చెందిన సీవీసీ కేపిటల్.. ఈ ఫ్రాంఛైజీ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన బేస్ ప్రైజ్ కంటే 160 శాతం అధికంగా బిడ్డింగులను దాఖలు చేసింది. దీని విలువ 5,625 కోట్ల రూపాయలు. ఇది కాస్తా పోటీ కంపెనీ అదాని గ్రూప్కు మింగుడు పడట్లేదు. తాను దాఖలు చేసిన బిడ్డింగ్ కంటే అధికంగా బేస్ ప్రైజ్ను చెల్లించి మరీ ఫ్రాంఛైజీని దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
అదాని కంటే అధికంగా కోట్..
ఫ్రాంఛైజీని తీసుకోవడానికి బీసీసీఐ నిర్ధారించిన బేస్ ప్రైజ్ 2,000 కోట్ల రూపాయలు. సీవీసీ గ్రూప్ అత్యధికంగా 5,625 కోట్ల రూపాయల మేర ఫైనాన్సియల్ బిడ్డింగ్ను దాఖలు చేసింది. అదాని వేసిన బిడ్డింగ్ ప్రైజ్ విలువ 5,100 కోట్ల రూపాయలు. అదాని కంటే అధికంగా బిడ్ను కోట్ చేసినందున.. సీవీసీ కేపిటల్కు ఫ్రాంఛైజీ దక్కింది. తనకంటే అధికంగా 525 కోట్ల రూపాయలను చెల్లించడాన్ని అదాని గ్రూప్కు తగిలిన బిగ్ షాక్గా చెప్పుకొంటున్నారు విశ్లేషకులు.
సీవీసీపై రివెంజ్..
దీనితో- సీవీసీ కేపిటల్పై రివెంజ్ తీర్చుకోవడానికి అదాని గ్రూప్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగుల్లో ఆరితేరిన కంపెనీగా అభివర్ణిస్తోంది. బెట్టింగులు, దాని అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు సీవీసీ కేపిటల్కు ఉన్నాయని ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమౌతున్నట్లు చెబుతున్నారు. దేశంలో బెట్టింగులు నిషేధం. అయినప్పటికీ- అక్రమంగా వాటిని నిర్వహించి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, దాన్నంతటినీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోసం ధారపోసిందని అదాని ఆరోపించింది.
ఇండిపెండెంట్ కమిటీతో దర్యాప్తునకు ఛాన్స్..
ఈ ఫిర్యాదులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై చర్చించడానికి శుక్రవారం సమావేశం కానుంది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, అరుణ్ ధుమాల్, బ్రిజేష్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా, తదితరులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఆరోపణలపై ఇండిపెండెంట్ కమిటీతో విచారణ జరిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఐపీఎల్ మీడియా హక్కులు, ఇతర అంశాలపై ఇందులో చర్చిస్తారు.