
వన్డే వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో ఉన్న బీసీసీఐ.. టీ20 వరల్డ్ కప్లో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ ముందు కొందరు కీలక ఆటగాళ్లు గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అలాంటి సమస్య మళ్లీ ఎదురు కాకూడదనే ఆలోచనతో.. ఇప్పుడే ఒక జట్టును అనుకొని, వారిని నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది.
గతేడాది టీమిండియా వైఫల్యాలు, ఆటతీరు, మెరుగు పరుచుకోవాల్సిన అంశాలపై బీసీసీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనిలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ తదితరులు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రోహిత్ను టీ20 కెప్టెన్గా తప్పించాలనే విషయం కూడా చర్చకు రాలేదు. వన్డేలు, టెస్టుల్లో అతనే జట్టును ముందుండి నడిపిస్తాడని బీసీసీఐ అధికారులు తేల్చేశారు. ఈ క్రమంలోనే మిగతా ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్పై కూడా తీవ్రమైన చర్చ జరిగింది.
గతేడాదిలో రకరకాల మార్పులు, చేర్పులు చేయకుండా ముందు నుంచి ఒక జట్టును అనుకొని, వారిని పర్యవేక్షణలో ఉంచాలని బీసీసీఐ భావించింది. అందుకే 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. వాళ్లు ఐపీఎల్లో కూడా మరీ ఎక్కువ శ్రమించకుండా పర్యవేక్షించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఒక బృందం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చిస్తుందని, సదరు ఆటగాళ్లు గాయాలపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని బీసీసీఐ తెలిపింది.
అయితే ఆయా ఆటగాళ్లపై రిస్ట్రిక్షన్స్ విధించే హక్కు బీసీసీఐకి ఉండదని ఐపీఎల్ ఫ్రాంచైజీలు మండిపడుతున్నాయి. 'ఒక ఆటగాడు ఇన్ని మ్యాచులే ఆడాలి లేదంటే ఫలానా బౌలర్ ఒక మ్యాచ్కు ఇన్ని ఓవర్లు మాత్రమే వేయాలి.. ఇలా పరిమితులు విధించే హక్కు బీసీసీఐకి లేదు. సదరు ఆటగాళ్లు ఎంత ఆడుతున్నారు? వారిపై ఎంత ఒత్తిడి పడుతోంది వంటి డేటా కావాలంటే బీసీసీఐ తీసుకోవచ్చు. అంతేకానీ, ఆ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వండి. అతన్ని ఎక్కువ సేపు ఆడించకండి.. వంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు' అని తేల్చిచెప్తున్నాయి ఫ్రాంచైజీలు.