ఐపీఎల్ 2024 సీజన్లో ఆఖరి సమరానికి వేళైంది. టైటిల్ కోసం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్-సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు చెపాక్ వేదిక కానుంది. సమవుజ్జీల మధ్య సాగే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో విజేతగా ఎవరు నిలుస్తారని ఇప్పటికే జోస్యాలు ప్రారంభమయ్యాయి.
అయితే చెపాక్లో శనివార భారీ వర్షం పడింది. నిన్న సాయంత్రం వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ తమ ప్రాక్టీస్ను రద్దు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ శుక్రవారమే రాజస్థాన్ రాయల్స్తో క్వాలిఫయిర్ -2 ఆడటంతో నిన్న అసలు సాధనే చేయలేదు. పూర్తిగా రెస్ట్ మోడ్లో ఉంది. కానీ గత నాలుగు రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న కేకేఆర్ ప్రాక్టీస్కు మాత్రం వరుణుడు అడ్డుపడ్డాడు.

కాగా, ఆదివారం కూడా చెపాక్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటని అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే చెపాక్లో భారీ వర్షం పడే సూచనలు లేవు. ఉరుములతో కూడిన వర్షం పడటానికి కేవలం ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇవాళ సాయంత్రం మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది. ఆదివారం రాత్రి జల్లులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా.
కానీ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం అయితే లేదు. ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తినా రిజర్వ్డే అయిన మరుసటి రోజు ఆటను కొనసాగిస్తారు. ఆదివారం ఆట ఎక్కడ ఆగిపోయిందో, అక్కడి నుంచే సోమవారం కంటిన్యూ చేస్తారు. అయితే రిజర్వ్ డేకు వెళ్లకుండా ఇవాళే మ్యాచ్ పూర్తికావడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తారు. మ్యాచ్ నిర్వహణకు రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తారు.
ఒక వేళ రిజర్వ్ డే రోజు కూడా ఫైనల్ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.ఈ లెక్కన టేబుల్ టాపర్ అయిన కేకేఆర్ ఖాతాలో మూడో టైటిల్ చేరుతుంది. పాయింట్ల టేబుల్లో కోల్కతా తొలి స్థానం, ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.