ఐపీఎల్ 2024లో ఛాంపియన్గా నిలవడానికి సన్రైజర్స్ హైదరాబాద్ మరో అడుగు దూరంలో నిలిచింది. మరో ఒక్క విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ విజేతగా నిలుస్తుంది. గత సీజన్లో ఎదురైన గుణపాఠాలను నేర్చుకుని, పొరపాట్లను పునరావృతం చేయకుండా ఈ సీజన్లో సన్రైజర్స్ ఫైనల్కు దూసుకొచ్చింది. ఇవాళ చెపాక్ వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది.
కాగా, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత కుర్రాళ్లు అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డిపై కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు జల్లు కురిపించాడు. ఈ యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్లేయర్లని కొనియాడాడు. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించడానికి శాయశక్తులా పోరాడతామని కమిన్స్ అన్నాడు. గతేడాది భారత్లో వన్డే వరల్డ్ కప్ ఆడటంతో పరిస్థితులకు అలవాటు పడ్డానని తెలిపాడు.

ప్రెస్ కాన్ఫరెన్స్లో కమిన్స్ మాట్లాడాడు. ''వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్ షిప్తో పాటు ఈ టైటిల్ కూడా సాధిస్తే అది నాకు గొప్ప విషయమే. కానీ ఏదో సమయంలో ట్రోఫీలను అందుకోవడం ఆగిపోతుంది. అయితే ఈ రెండేళ్లు అద్భుతంగా సాగాయి. ఐపీఎల్కు కంటే ముందే టీ20 ఫార్మాట్ సిరీస్కు నేను నాయకత్వం వహించలేదు. కాబట్టి అంచనాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. వన్డే ప్రపంచకప్ ఇక్కడే ఆడటంతో విదేశాల్లో ఐపీఎల్ ఆడిన అనుభూతి నాకు రావట్లేదు''
''మా జట్టు గొప్పగా ఉంది. దూకుడుగా ఆడుతున్నాం. సీజన్లో 14 మ్యాచ్లు గెలవడానికి సాధ్యం కాదు. కానీ అదే తరహాలో ఆడితే ఎక్కువ విజయాలు అందుకుంటాం. ఈ ధోరణీతోనే బరిలోకి దిగుతున్నాం. ఈ దారిలో కొన్నిసార్లు పరాజయాలు ఎదురవుతాయి. అది ఫర్వాలేదు. కానీ గొప్పగా ప్రయత్నించాలి. నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ గొప్ప ఉదాహరణ. వాళ్లు భారత జట్టులో లేరు. కానీ అద్భుతమైన ఆటగాళ్లు. ఈ సీజన్లో మా కథ ఇదే. మా కుర్రాళ్లు అదరగొట్టి జట్టును గెలిపిస్తున్నారు'' అని కమిన్స్ అన్నాడు. కాగా, ఇవాళ నితీశ్ రెడ్డి బర్త్డే కావడం విశేషం. ఈ తెలుగు కుర్రాడు ఈ సీజన్లో 143 స్ట్రైక్రేటుతో దాదాపు 300 పరుగులు చేశాడు.