ఐపీఎల్-2024 అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్- సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. సమవుజ్జీల మధ్య సాగే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ పోరులో విజయం ఎవరూ సాధిస్తారనే చర్చ మొదలైంది. లీగ్ దశలో మూడే పరాజయాలు, భారీ రన్రేటుతో కేకేఆర్ అగ్రస్థానంలో నిలిచింది.
మరోవైపు సన్రైజర్స్ రికార్డు స్కోరులు సాధిస్తూ, విధ్వంసకర బ్యాటింగ్తో రెండో స్థానంలో ముగించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన క్వాలిఫయిర్-1 ఏకపక్షంగా సాగింది. సన్రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా ఘన విజయం సాధించింది. అయితే పొరపాట్లను సరిదిద్దుకుంటూ తిరిగి సత్తాచాటి ఫైనల్కు దూసుకొచ్చిన ఎస్ఆర్హెచ్పై గెలవడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో చెపాక్లో పైచేయి ఎవరిదనే ఉత్కంఠ మొదలైంది.

అయితే ఫైనల్లో కేకేఆర్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అన్నాడు. క్వాలిఫయిర్-1 తర్వాత కోల్కతాకు తగినంత విశ్రాంతి లభించిందని, ఇది ఆ జట్టుకు వరంగా మారిందని పేర్కొన్నాడు. ''కేకేఆర్ కచ్చితంగా విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నా. కోల్కతా జట్టుకు విశ్రాంతి లభించింది.ఈ సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ బలాలు, బలహీనతలను అర్థంచేసుకోవడానికి మంచి అవకాశం లభించింది''
''అంతేగాక గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై సాధించిన విజయం కేకేఆర్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇక చెపాక్లో ఎర్రమట్టిపై వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తీవ్ర ప్రభావం చూపిస్తారు. ఇది కోల్కతాకు కలిసొస్తుంది'' అని హెడెన్ అన్నాడు. చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ సత్తాచాటారు.

కాగా, ఈ సీజన్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ రెండు సార్లు తలపడ్డాయి. రెండింట్లోనూ కోల్కతానే పైచేయి సాధించింది. సన్రైజర్స్పై లీగ్ మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో, క్వాలిఫయిర్-1లో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్ నెగ్గింది. ఐపీఎల్లో ఓవరాల్గా ఇరు జట్లు 27 మ్యాచ్లు ఆడగా మూడింట రెండో వంతు కోల్కతానే విజయం సాధించింది. సన్రైజర్స్ తొమ్మిదింట్లోనే గెలిస్తే, కేకేఆర్ 18 మ్యాచ్ల్లో విజయఢంకా మోగించింది.