బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను తొలిసారి సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ప్రశంస మాత్రం విస్తృత చర్చకు దారితీసింది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించిన హైదరాబాద్ ఆటగాళ్లను'నైస్ గాయ్స్' అంటూ గంభీర్ కొనియాడాడు.
గంభీర్కు బెంగళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ మొదటి నుంచి కొంత శత్రుత్వ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ చేసిన ట్వీట్.. కోహ్లీని టార్గెట్ చేసినట్లుందనే చర్చ సాగుతోంది.

'ఐపిఎల్ ఫైనల్లో గెలిచిన సన్రైజర్స్కు అభినందనలు. నైస్ గాయ్స్ ముందే ఫినిష్ చేశారు. వెల్డన్. బౌలర్లు ఏ మ్యాచ్లనైనా గెలిపించగలరు' అని గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
హైదరాబాద్ ఆటగాళ్లను 'నైస్ గాయ్స్' అంటే ప్రత్యర్థి ఆటగాళ్లైన కోహ్లీ టీం అందుకు విరుద్ధమా? అనే సందేశం ఇచ్చినట్లయింది. అంతేగాక, బౌలింగ్ ఉంటే మ్యాచ్లు గెలవచ్చని గంభీర్ వ్యాఖ్యానించాడు. అంటే, బ్యాటింగ్ లైనప్ మాత్రమే కలిగివున్న కోహ్లీ టీంను ఎద్దేవా చేసినట్లు అర్థమవుతోంది. దీంతో పలువురు అభిమానులు స్పందించారు.
కోహ్లీని లక్ష్యంగా చేసుకుని గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడా? అని ప్రశ్నించారు. అలా కాకుంటే మరోసారి స్పందించాలని కొందరు కోరారు. కోహ్లీపై కోపాన్ని మరోసారి గంభీర్ బయటపెట్టుకున్నాడని మరికొందరు అభిమానులు వ్యాఖ్యానించారు. 'హైదరాబాద్ జట్టును నైస్ గాయ్స్ అంటే బెంగళూరు జట్టు కాదనేగా' అని వేరొక అభిమాని వ్యాఖ్యానించాడు.

కోహ్లీ అంటే గంభీర్కు అసూయ అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మరో అభిమాని పేర్కొన్నాడు. 'కోహ్లీ బ్యాడ్ గాయ్' అని గంభీర్ భావిస్తున్నాడా? అని మరో అభిమాని ప్రశ్నించాడు. కాగా, ఢిల్లీకే చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలం నుంచి మైదానంలో చిన్న చిన్న గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ ఐపిఎల్ సీజన్లో ఓసారి కోహ్లీపైకి బంతి విసిరాడు గంభీర్. అంతేగాక, బెంగళూరుపై తమ జట్టు విజయం సాధిస్తున్న క్రమంలో గంభీర్ తన కూర్చీని తన్ని 15శాతం మ్యాచ్ ఫీజు కోత పెట్టుకున్నాడు.