హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తొలిసారి పైనల్కు చేరిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టును ఓడిస్తామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
'ఫైనల్ మ్యాచ్ జరిగే ఉప్పల్ మైదానంలో గెలుపు అవకాశాలు ఇరు జట్లకి సమానంగా ఉంటాయి. పుణె జట్టుపై గత మ్యాచ్ల్లో మేము చాలా తప్పిదాలు చేశాం. కానీ.. ప్రస్తుతం వాటిని మేము సరిదిద్దుకున్నాం. ఫైనల్లో మాత్రం ఆ తప్పుల్ని పునరావృతం చేయం' అని ధీమా వ్యక్తం చేశాడు.
కెప్టెన్గా మూడోసారి ఫైనల్ ఆడుతున్న మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? అని రోహిత్ శర్మని ప్రశ్నించగా 'ఈ ఫైనల్ నాకు చాలా ముఖ్యమైంది. ఒక కెప్టెన్గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. అయితే మూడోసారి కెప్టెన్గా ఫైనల్ ఆడుతున్నా అనే అంశంపై మాత్రం నేను అతిగా ఆలోచించడం లేదు. ఫైనల్లో శక్తివంచన లేకుండా పోరాడతాం. ఫలితం అదే వస్తుంది' అని అన్నాడు.
కాగా, పైనల్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రైజింగ్ పుణె సూపర్జెయింట్ మొదటిగా బౌలింగ్ చేయనుంది. టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన పుణె జట్టు టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ సీజన్లో లీగ్ దశలో రెండు సార్లు.. ప్లేఆఫ్లో ఒకసారి ఓటమి పాలైన ముంబై తుది పోరులో పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని భావిస్తోంది.