
ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో 14పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రజత్ పటిదార్ (54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 112 నాటౌట్), చివర్లో దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులకే పరిమితమై ఈ టోర్నీ నుంచి వైదొలిగింది.
ఇక ఈ మ్యాచ్లో లక్నో ఫీల్డింగ్ వైఫల్యం ఆ జట్టును ఘోరంగా దెబ్బతీసింది. ఆ జట్టు నాలుగు క్యాచ్ లు మిస్ చేసుకోవడంతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇక లక్నో బ్యాటింగ్లోనూ చాలా తడబడింది. ఇక లక్నో బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను డగౌట్లో కూర్చుని గమనిస్తున్న ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో ఫ్రస్టేట్ అయ్యాడు. గట్టిగా అరుస్తూ.. తలపై చేతులు పెట్టుకుంటూ తీవ్ర కోపంగా కన్పించాడు.
ఈ సీజన్లో లక్నో ఓ మ్యాచ్లో కోల్ కతా చేతిలో దారుణంగా ఓడిపోయినప్పుడు గంభీర్ క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. గంభీర్ ఇప్పుడే కాదు తాను ఆడే రోజుల్లోనూ ఎంతో అగ్రెసివ్ ప్లేయర్గా కన్పించేవాడు. ఇక తాజా మ్యాచ్లో గంభీర్ ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరుకుంది. అతను మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో చాలా విచారకరంగా మాట్లాడాడు. రాహుల్తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్గా కూడా మారాయి. ఈ ఫొటోలో గంభీర్ రాహుల్కు క్లాస్ పీకినట్లు కన్పించింది.
ఇక ఈ మ్యాచ్ అనంతరం గంభీర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఓటమి గురించి భావోద్వేగ పూరితమైన పోస్టు ఇన్ స్టాలో పెట్టాడు. 'ఈరోజు హార్డ్ లక్. అయినప్పటికీ ఈ సీజన్లో కొత్త టీం అయినప్పటికీ మా లక్నో టీం ఎంతో ఆకట్టుకునేలా ఆడింది. తప్పకుండా తర్వాతి సీజన్కు మరింత బలంగా తిరిగి వస్తాం.' అని గంభీర్ పేర్కొన్నాడు. లక్నో టీం ఎలిమినేటర్లోనే తన ప్రయాణం ముగించినప్పటికీ ఆ జట్టులో ఒకరిద్దరు మంచి ప్లేయర్లు వెలుగుచూశారు. వారిలో మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీ చెప్పుకోదగ్గవారు.