ముంబై: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ తొలి పోరులో ముంబై బ్యాటింగ్ సమయంలో తమ జట్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు ఒక్క ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చారో తనకు తెలియదని అజింక్యా రహానే అన్నాడు. శనివారం జరిగిన తొలు మ్యాచులో ముంబై ఇండియన్స్ పైన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ గెలిచింది.
ఈ మ్యాచులో పుణేను రహానే గెలిపించాడు. రహానే దూకుడుగా ఆడి మ్యాచ్ గెలిపించాడు. అనంతరం అతను విలేకరులతో మాట్లాడాడు. ఆర్ అశ్విన్ తో ఒక్క ఓవర్ మాత్రమే ఎందుకు వేయించారో తనకు తెలియదన్నాడు. ముంబై ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బౌలింగుకు వచ్చిన అశ్విన్ 7 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
ఈ విషయంలో కెప్టెన్ ధోనీ మనసులో ఏం కారణముందో తనకు తెలియదన్నాడు. కారణం కెప్టెన్కు మాత్రమే తెలిసి ఉంటుందని, ఇదో వైవిధ్యమైన వికెట్ అన్నాడు. వెస్టిండీస్తో మేము ఆడిన మ్యాచ్ వికెట్ కన్నా ఇది భిన్నంగా ఉందని తెలిపాడు.

ఫాస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను నిలువరిస్తున్నందున అశ్విన్ అవసరం లేకపోయిందని కెప్టెన్ ధోనీ భావించాడేమోనన్నాడు. అశ్విన్ అద్భుతమైన, అనుభవం కలిగిన బౌలర్ అన్నాడు. ధోనీ, పీటర్సన్, స్మిత్ రూపంలో తమ జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు.
హర్భజన్ సింగ్ రికార్డు
పుణేతో జరిగిన పోరులో హర్బజన్ సింగ్ 30 బంతుల్లో 45 పరుగులు (నాటౌట్) చేశాడు. భజ్జీ పుణ్యమా అని ముంబై 121 పరుగులు చేసింది లేదంటే వంద లోపే అవుటయ్యేది. తాజా స్కోర్తో భజ్జీ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్లో ఎనిమిదో నెంబర్ బ్యాట్సుమెన్కు 45 పరుగులు రెండో అథ్యధిక స్కోరు. తొలి స్థానంలోను భజ్జీనే 64 పరుగులతో ఉన్నాడు.
వాంఖేడేలో ఐపీఎల్ మ్యాచులో ఓ బౌలర్ నాలుగు ఓవర్లు వేసి పది లేదా అంతకంటే తక్కువ పరుగులు ఇచ్చుకోవడం నిన్నటి మ్యాచులో మూడోసారి. రజిత్ భాటియా ఓ వికెట్ తీసి 10 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు పొలాక్, స్టెయిన్ ఈ ఘనత సాధించారు.
ఐపీఎల్ చరిత్రలో ఓ మ్యాచులో నలుగురు బౌలర్లు తమ తమ తొలి బంతులకే వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మను ఇషాంత్, పాండ్యాను మార్ష్, పొలార్డును భాటియా, అంబటి రాయుడును ఆర్ అశ్విన్ ఔట్ చేశారు.