మరో వారం రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్ ఆరంభించాయి. స్టార్ ప్లేయర్లతో శిక్షణ శిబిరాలు కళకళలాడుతున్నాయి. మరోవైపు కొందరు ఆటగాళ్లు ఇంకా తమ జట్లతో చేరలేదు. వాళ్లంతా రెండు మూడు రోజుల్లో తమ జట్లతో చేరనున్నారు. మరికొందరు గాయాలతో, వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు.
తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ లుంగీ ఎంగిడి చేరాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎంగిడీ ఆడట్లేదని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. గాయం కారణంగా అతడు లీగ్ నుంచి తప్పుకుంటున్నాడని తెలిపింది. ఎంగిడీ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ను జట్టులో చేర్చుకున్నట్లు వెల్లడించింది.

ఫ్రేజర్ను కనీస ధర రూ.50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం చేసుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో తొలుత ఫ్రేజర్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం ఫ్రేజర్ సామర్థ్యంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఓ అంచనాకు వచ్చాడు. తొలుత ఈ సీజన్లో పాల్గొనడంపై అనిశ్చితిలో ఉన్న హ్యారీ బ్రూక్ స్థానంలో ఫ్రేజర్ను తీసుకోవాలని ఢిల్లీ భావించింది. కానీ ఎంగిడీ గాయంతో తప్పుకోవడంతో ఆలస్యం చేయకుండా ఫ్రేజర్ను దక్కించుకుంది.
''ఐపీఎల్ 2024లో లుంగి ఎంగిడీ స్థానంలో ఆల్రౌండర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడి 25 వికెట్లు తీసిన ఎంగిడీ గాయం కారణంగా ఈ సీజన్కు దూరమయ్యాడు. జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలు ఆడాడు. రూ.50 లక్షల రిజర్వ్ ధరతో అతడిని ఢిల్లీ సొంతం చేసుకుంది'' అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఫ్రేజర్ విధ్వంసక బ్యాటర్. భారీ షాట్లను సునాయాసంగా ఆడగలడు. వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అంతేగాక 29 బంతుల్లో సెంచరీ బాది వైట్ బాల్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సాధించాడు. మార్ష్ కప్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన ఫ్రేజర్ తస్మనియా జట్టుపై ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతులు) పేరిట ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.