
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (43; 41 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే ఫరవాలేదనిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు 129 పరుగులు చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లు పృథ్వీషా(11), శిఖర్ధావన్(12) స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేరారు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(43), రిషభ్ పంత్(5)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ మహ్మద్ నబీ బౌలింగ్లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. దాంతో ఢిల్లీ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. చివర్లో అక్షర్ పటేల్(23 నాటౌట్), క్రిస్ మోరిస్(17) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
సన్రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్, మహ్మద్ నబీ, సిద్ధార్థ్కౌల్ రెండేసి వికెట్లు తీయగా రషీద్ఖాన్, సందీప్శర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్తో కనిపిస్తోంది.
సన్రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే గత సీజన్లలో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, ఈ సీజన్లో మాత్రం బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట విజయం సాధించింది.