

హైదరాబాద్: 'మన్కడింగ్ ఔట్' అనే పదం సోమవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ని 'మన్కడింగ్ ' ఔట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్కు చేర్చాడు. అశ్విన్ చేసిన పనిని కొందరు సమర్థిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
నిబంధనల (రూల్ 41.16) ప్రకారం మన్కడింగ్ ఔట్ అనేది సరైందే అయినప్పటికీ.. అది క్రీడా స్పూర్తికి విరుద్ధమని సోషల్ మీడియాలో నెటిజన్లు అశ్విన్ను ఏకిపారేస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని నెటిజన్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సైతం అశ్విన్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా... అశ్విన్కే మద్దతుగా పలికాడు. అశ్విన్ చేసిన పని సరైనది అంటూ ఆయన తన ట్వీట్లు చేశారు. "గతంలో కెప్టెన్స్, మ్యాచ్ రెఫరీలతో జరిగిన ఓ మీటింగ్లో ఈ అంశం గురించి చర్చించాం" అని అన్నారు.
"నాన్-స్ట్రైకర్ బ్యాట్స్మెన్ క్రీజు దాటితే బౌలర్ అతన్ని అతన్ని మర్యాదపూర్వకంగా ఔట్ చేయడం సరైందే. ఈ మీటింగ్ కోల్కతాలో జరిగింది. ఇందులో ధోనీ, విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నారు" అంటూ రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. రాజీవ్ శుక్లా ట్వీట్పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
"ఈ ట్వీట్ చూశాక ఐపీఎల్ మొత్తం ఫిక్సింగ్ అని నాకు అర్థం అవుతోంది. క్రికెట్ తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. క్రీడాస్పూర్తి ఉన్నప్పుడు రూల్స్ ఎందుకు, కానీ రూల్స్ ఉన్నప్పుడు వాటిపై బ్యాట్స్మెన్లకు ఎందుకు అవగాహన లేదు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరొక నెటిజన్ అయితే "సర్, అలా అయితే కొత్తగా ఆడే బ్యాట్స్మెన్లు ఔట్ అయితే వారికి మర్యాదగా మరోసారి అవకాశం ఇవ్వండి. ఇంకా యువ బౌలర్ల ఓవర్లో ఆరు పరుగుల కంటే ఎక్కువ కొట్టకూడదు" అని ట్వీట్ చేశాడు.