హైదరాబాద్: 'ఇంతింతై వటుడింతై' అన్నట్లు బీసీసీఐ ఆరంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏటా వృద్ధి సాధిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను వేలం ద్వారా కొనుగోలు చేసి లీగ్ను నిర్వహిస్తుంది. దీంతో మంచి ఆదరణతో పాటు భారీగా ఆదాయాన్ని కూడా కుమ్మరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులకు చిరునామా ఈ లీగ్. అందుకేనేమో లీగ్లో సిక్సర్లు ఎగిసినంత ఎత్తుగా 'బ్రాండ్' విలువ కూడా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 18.3శాతం ఆధాయం పెరిగినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.
ప్రస్తుత ఐపీఎల్ వ్యవస్థ మొత్తం విలువెంతో తెలుసా... 6.3 బిలియన్ అమెరికా డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా 43 వేల కోట్ల రూపాయలు. ఒక్క ఏడాదిలోనే ఒక బిలియన్ డాలర్లు అంటే రూ. 6,866 కోట్లు పెరిగిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రముఖ అంతర్జాతీయ విలువ గణన కంపెనీ 'డఫ్ అండ్ ఫెల్ప్స్' తాజా నివేదికలో ఈ అంశాల్ని వెల్లడించింది.
మొత్తం ఎనిమిది జట్లలో ముంబై ఇండియన్సే అత్యధిక విలువైన ఫ్రాంచైజీ. ముంబై బ్రాండ్ వ్యాల్యూ 113 మిలియన్ డాలర్లు (రూ. 6955 కోట్లు). బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జట్టు కోల్కతా నైట్రైడర్స్ విలువ 104 మిలియన్ డాలర్లు (రూ.6867 కోట్లు). అత్యధిక మొత్తంతో బ్రాడ్ కాస్టింగ్ డీల్ కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్ ఒక విధంగా ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదం చేసింది.
కేవలం ఇంగ్లిష్ వ్యాఖ్యానానికే పరిమితం కాకుండా 8 భారతీయ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని జోడించడం ద్వారా అనూహ్యంగా టీవీ ప్రేక్షకుల్ని పెంచేసింది. దీంతో ప్రేక్షకాదరణతో ప్రకటనలు, ఆదాయం ఇలా ఒకదాంతో మరొకటి కలిసి ఐపీఎల్ బ్రాండ్ బాజాను మోగించినట్లు 'డఫ్ అండ్ ఫెల్ప్స్' తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు ఈ ఐపీఎల్ యువ క్రికెటర్లకు సైతం.. మరిన్ని అవకాశాలు దక్కేందుకు మంచి ఫ్లాట్ఫాంగా మారింది.