హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో మరో ఫిక్సింగ్ ఉదంతం వెలుగుచూసింది. ఈసారి గుజరాత్ లయన్స్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఈ ఫిక్సింగ్ స్కాంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు ముగ్గురు బుకీలను కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెల్లడైంది.
ఈ ఫిక్సింగ్ ఉదంతాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. పోలీసుల కంటే ముందే బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ జరుపుతోందని బోర్డు స్పష్టం చేసింది. బీసీసీఐ, ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖకు గురువారం అందించిన సమాచారంతో రమేష్ నయన్ షా, రమేష్ కుమార్, వికాష్ కుమార్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖ వీరిని అరెస్టు చేసింది. వీరి వద్ద పోలీసులు నుంచి రూ.41 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్లు బస చేసిన హోటల్లోనే ఈ బుకీలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
రమేష్ కుమార్ గ్రీన్ పార్క్ స్టేడియంలో హోర్డింగుల కాంట్రాక్టర్. ఇతడు క్రికెట్ బెట్టింగులు పెట్టే అజ్మీర్కు చెందిన బంటి పేరుమీద గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఉండే హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆటగాళ్లతో కలిసినట్లు పోలీసులు భావిస్తునారు. ప్రస్తుతం బంటి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తాము ఇద్దరు గుజరాత్ లయన్స్ ప్లేయర్స్తో మాట్లాడినట్లు ఈ బుకీల్లో ఒక వ్యక్తి వెల్లడించాడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల మీద నిఘా ఉందని, వారితో రమేష్ నయన్ షా తరచుగా వారితో కాంటాక్టులో ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు.
అయితే నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. అయితే ఐపీఎల్లో ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూడటం ఇదే మొదటిసారి కాదు. 2013లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ నుంచి ఆ రెండు జట్లను తప్పించిన సంగతి తెలిసిందే.